ఆందోళనకారులతో జనగణమన పాడించిన బెంగళూరు డీసీపీ: బుద్ధిగా ఆలపించి తిరుగుముఖం..!
Recommended Video
బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రదర్శనలను నిర్వహిస్తోన్న ఆందోళనకారులతో జాతీయ గీతాన్ని పాడించారు డిప్యూటీ కమిషనర్ (సెంట్రల్) చేతన్ సింగ్ రాథోడ్. బుద్ధిగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం ఆందోళనకారులు.. తమ నిరసనలకు పుల్ స్టాప్ పెట్టారు. అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆందోళనకారుల పట్ల డీసీపీ ప్రదర్శించిన చాకచక్యాన్ని ప్రపంచానికి చాటుతోంది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొద్దిరోజులుగా బెంగళూరులో నిరసన ప్రదర్శనలు కొనసాగుతూ వస్తోన్నాయి. సర్ పుట్టణ్న ఛెట్టి టౌన్ హాల్ ను కేంద్రంగా చేసుకుని ఆందోళనకారుల నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు ఏర్పాటవుతున్నాయి. ఆందోళనకారులను అడ్డుకోవడానికి బెంగళూరు పోలీసు యంత్రాంగం పలు రకాలుగా ప్రయత్నించి, విఫలమైంది. ఫలితంగా- కొన్ని సందర్భాల్లో వారిపై లాఠీఛార్జీని కూడా చేయాల్సి వచ్చింది.
#WATCH Karnataka: DCP of Bengaluru(Central),Chetan Singh Rathore sings national anthem along with protesters present at the Town Hall in Bengaluru, when they were refusing to vacate the place. Protesters left peacefully after the national anthem was sung. #CitizenshipAmendmentAct pic.twitter.com/DLYsOw3UTP
— ANI (@ANI) December 19, 2019
ఈ పరిస్థితుల్లో బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్.. తన చాకచక్యాన్ని ప్రదర్శించారు. ఆందోళనకారులతో నిరసన ప్రదర్శనలను విరమింపజేయడానికి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. విజయం సాధించారు కూడా. టౌన్ హాల్ వద్ద ఆందోళనకారులను కలుసుకున్న ఆయన..దేశభక్తిని పెంపొందించేలా ఆవేశంగా ప్రసంగించారు. అనంతరం- తాను జనగణమన గీతాన్ని పాడబోతున్నానని, తనతో ఎంతమంది గొంతు కలుపుతారని ప్రశ్నించారు.
దీనితో అక్కడున్న వారందరూ చేతులు ఎత్తారు. అనంతరం జనగణమన గీతాన్ని ఆలపించారు. చేతన్ సింగ్ తో కలిసి ఆందోళనకారులు కూడా బుద్ధిగా గొంతు కలిపారు. జాతీయ గీతం పూర్తయిన అనంతరం సెల్యూట్ చేసి, మరీ తమ ఆందోళనను విరమించుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. డీసీపీ చేతన్ సింగ్ సందర్భోచితంగా వ్యవహరించారని కీర్తిస్తోంది సోషల్ మీడియా.