జీరో ట్రాఫిక్ తో హల్ చల్: ప్రజలకు సినిమా చూపించిన ఉప ముఖ్యమంత్రి, స్కూలు బస్సలు అంతే !
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మరోసారి బెంగళూరు ప్రజలకు సినిమా చూపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి బయలుదేరిన ఉప ముఖ్యమంత్రి అదే ప్రజలకు సమస్య గా తయారైనారు. ప్రజలు శాపనార్తాలు పెట్టడంతో వారికి సర్దిచెప్పలేక పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నానా తంటాలు పడ్డారు.
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎలా ఉంటాయో నగర ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఇబ్బందులతో నగర ప్రజలు నరకం అనుభవిస్తుంటారు. అయితే సరిగ్గా అలాంటి సమయంలో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ జీరో ట్రాఫిక్ లో సంచరించడంతో స్థానికులు సహనం కొల్పోయారు.
బెంగళూరు నగరంలోని ఆర్ టీ నగర్ లో రోడ్ల వెడల్పు అభివృద్ది పనులు జరుగుతున్నాయి. రోడ్ల వెడల్పు అభివృద్ది పనులు పరిశీలించడానికి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ జీరో ట్రాఫిక్ లో ఆ ప్రాంతానికి వెళ్లారు. ఆ సందర్బంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
నిత్యం ఉండే ట్రాఫిక్ కు తోడు జీరో ట్రాఫిక్ తో గంటలు గంటలు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. చివరికి రోడ్లు అభివృద్ది పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కు తమ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు మొర పెట్టుకున్నారు.
మాకు రోడ్డు వెడల్పు పనులు అవసరం లేదని, ఉన్న రోడ్డు సక్రమంగా ఉంటే చాలని, ఆ పనులు చేయించాలని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ కు స్థానికులు షాక్ ఇచ్చారు. ఆర్ టీ నగర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని, బీబీఎంపీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని స్థానికులు ఉప ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.
ప్రజల సమస్యలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ మళ్లీ జీరో ట్రాఫిక్ లో అక్కడి నుంచి బయలుదేరారు. ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్ వెనుక భారీ సంఖ్యలో ఆయన ఆనుచరుల వాహనాలు వెళ్లడంతో ట్రాఫిక్ జాం అయ్యింది. ఉప ముఖ్యమంత్రి వెళ్లిపోయి అర్దగంట అయినా స్కూల్ బస్సులు, వ్యాన్ లను సైతం పోలీసులు నిలిపివేయడంతో తీవ్ర విమర్శలు ఎదురైనాయి.