ఎమ్మెల్యేలు మాయం: ప్రత్యేక విమానంలో బెంగళూరుకు, హోటల్ లో డీజీపీ, కమీషనర్ సోదాలు!
బెంగళూరు: కాంగ్రెస్ అధిష్టానంకు చిక్కకుండా మాయం అయిన కర్ణాటకలోని బళ్లారి జిల్లా విజయనగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనంద్ సింగ్, మస్కి ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్ బస చేశారని సమాచారం రావడంతో బెంగళూరులోని గోల్డ్ ఫించ్ హోటల్ కు డీజీపీ నీలమణి రాజు, బెంగళూరు నగర పోలీసు కమీషనర్ టి. సునీల్ కుమార్ వెళ్లి పరిశీలిస్తున్నారు.
నాలుగు రోజులుగా మాయం
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకుని గోల్డ్ ఫించ్ హోటల్ లో బసచేశారని పోలీసులకు సమాచారం అందింది. గత నాలుగు రోజుల నుంచి ఎవ్వరికీ కనపడుకుండా ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
బళ్లారి రెడ్డి అదుపులో !
బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ను గోల్డ్ ఫించ్ హోటల్ లో నిర్బంధించారని బెంగళూరు గ్రామీణ కాంగ్రెస్ ఎంపీ డీకే. శివకుమార్ ఆరోపణలు చెయ్యడంతో డీజీపీ నీలమణి రాజు, బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ సునీల్ కుమార్ హోటల్ లో సోదాలు మొదలు పెట్టారు.
హోటల్ లో మాయం
గోల్డ్ ఫించ్ హోటల్ లో ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ఉన్నారని సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి హెచ్.ఎం. రేవణ్ణ, గోవిందరాజు హోటల్ దగ్గరకు చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ ఎవ్వరికీ కనిపించలేదు.
పోలీసుల ఆధీనంలో హోటల్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిర్బంధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి సోమశేఖర్ రెడ్డి సైతం గోల్డ్ ఫించ్ హోటల్ లో కపించలేదు. గోల్డ్ ఫించ్ హోటల్ మొత్తం స్వాధీనంలోని తీసుకున్న బెంళూరు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.