మాజీ సీఎంకు సీబీఐ చిక్కులు ? అక్రమంగా ఇంటి నిర్మాణం, కోర్టులో కేసు: డీజీపీ లేఖతో ప్రభుత్వం!
బెంగళూరు/మైసూరు: వ్యవసాయ భూమిలో అక్రమంగా ఇంటిని నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సినిమా కష్టాలు మొదలైనాయని సమాచారం. సిద్దరామయ్య అక్రమ ఇంటి నిర్మాణం విచారణ సీబీఐకి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. సిద్దరామయ్య వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సిద్దరామయ్య వ్యవహారంలో మైసూరు నగర పోలీసు కమీషనర్ కు డీజేపీ లేఖరాశారు.
సమన్వమ సమితి
కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం సమన్వయ సమితి అధ్యక్షుడిగా సిద్దరామయ్య పని చేస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలు సైతం సమన్వయ సమితి సభలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వ్యవసాయ భూమిలో ఇల్లు
మైసూరులోని విజయనగరలోని సిద్దరామయ్య ఇల్లు ఇప్పుడు వివాదానికి కేంద్రబింధువు అయ్యింది. సిద్దరామయ్య ఇల్లు వ్యవసాయ భూమిలో నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఇల్లు నిర్మించిన భూమి కొనుగోలు, నిర్మాణం, అనుమతి తదితర వ్యవహారాల్లో మొత్తం గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ మైసూరుకు చెందిన గంగరాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.
అధికార దుర్వినియోగం
మైసూరు నగరాభివృద్ది ప్రాధికార (ముడా) ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ది చెయ్యవలసి ఉంది. అయితే అధికారంలో ఉన్న సిద్దరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ భూమి డీనోటిఫికేషన్ కాకుండానే కొనుగోలు చేసి ఇంటిని నిర్మించారని మైసూరుకు చెందిన గంగరాజు కోర్టును ఆశ్రయించారు.
అనుమతి లేదు
మైసూరు నగరాభివృద్ది ప్రాధికార అనుమతి, గ్రామ పంచాయితీ నుంచి అనుమతి తీసుకోకుండానే సిద్దరామయ్య ఇంటిని నిర్మించారని విమర్శలు ఉన్నాయి. మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు నలుగురి మీద మైసూరులోని లక్ష్మీపురం పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. మైసూరు సిటీ సివిల్ కోర్టులో సిద్దరామయ్య మీద ఫిర్యాదు చేశారు.
అక్రమ డీనోటిఫికేషన్
వాస్తవంగా 400-500 ఎకరాల భూమిని ప్రభుత్వం భూస్వాధీనం చేసుకుంది. అయితే అందులో 30 గంటలు అక్రమంగా డీనోటిఫికేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు ముడా మాజీ అధక్షులు సీ. బసవరాజ్ గౌడ, డి. దృవకుమార్ తో సహ నలుగురి మీద ఫిర్యాదు చేశానని మైసూరుకు చెందిన గంగరాజు అంటున్నారు.
డీజీపీ ఆదేశాలు
మాజీ సీఎం సిద్దరామయ్య మీద ఫిర్యాదు చేసినా మైసూరు పోలీసు అధికారులు పట్టించుకోలేదని, ఆయన మీద నమోదు అయిన కేసు సీబీఐతో విచారణ జరిపించాలని మైసూరుకు చెందిన గంగరాజు డీజీపీకి లేఖరాశారు. గంగరాజు రాసిన లేఖపై వివరణ ఇవ్వాలని డీజీపీ నీలమణిరాజు మైసూరు నగర పోలీసు కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు కేసు విచారణ సీబీఐకి అప్పగిస్తారా ? సిద్దరామయ్యకు కష్టాలు మొదలైతాయా ? అనే విషయం వేచి చూడాలి.