స్పీకర్ ను అడ్డుకుంటున్నారా ? ఎందుకు ఆలస్యం చేశారు, సుప్రీం కోర్టు ప్రశ్న, రెబల్ ఎమ్మెల్యేలు !
న్యూఢిల్లీ: కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు అంగీకరించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చెయ్యాలని మనవి చేస్తూ సుప్రీం కోర్టులో సమర్పించిన అర్జీ విచారణ వాదనలు వాడివేడిగా జరిగాయి. ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించకుండా స్పీకర్ ను ఎవరైనా అడ్డుకుంటున్నారా ? ఎందుకు ఆలస్యం అవుతోంది అని సుప్రీం కోర్టు స్పీకర్ న్యాయవాదిని ప్రశ్నించింది.
స్పీకర్ కు కొన్ని హక్కులు ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగాయ్ స్పష్టం చేశారు. అయితే జులై 6 లేదా 8వ తేదీ రాజీనామాల విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకుని ఉంటే ఎమ్మెల్యేలు ఇక్కడి వరకు వచ్చే వాళ్లు కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
చట్టబద్దంగా తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, వారి మీద ఎలాంటి ఒత్తిడి లేదని, వారి రాజీనామాలు అంగీకరించడంలో ఆలస్యం చెయ్యకూడదని స్పీకర్ కు ఆదేశాలు జారీ చెయ్యాలని రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టుకు మనవి చేశారు.
రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరడం, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మంత్రులు కావడానికి అర్హులని న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టుకు చెప్పారు. ఉమేష్ జాదవ్ మీద అనర్హత వేటు వెయ్యాలని ఫిర్యాదు చేశారని అయితే ఆయన రాజీనామాను ఇదే కర్ణాటక స్పీకర్ అంగీకరించారని రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చెయ్యాల్సి వచ్చింది అంటూ న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టులో వివరించారు. స్పీకర్ కు కొన్ని హక్కలు ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ అర్జీ విచారణలో ఎలాంటి తీర్పు వస్తుందని మీరు ఎదురుచూస్తున్నారు అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయ్ రెబల్ ఎమ్మెల్యేల న్యాయవాది ముకుల్ రోహటగిని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేస్తారని ఎదురు చూస్తున్నామని న్యాయవాది ముకుల్ రోహటగి సుప్రీం కోర్టుకు చెప్పారు.
కర్ణాటక స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. చట్టం ప్రకారం రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ అన్నారు.
జులై 11వ తేదీ రాజీనామాలు చేసిన 11 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరైనారని, ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరుకాలేదని స్పీకర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ న్యాయమూర్తికి చెప్పారు. స్పీకర్ అందుబాటులో లేరని, అందుకే తాము కోర్టును ఆశ్రయించామని అర్జీలో రెబల్ ఎమ్మెల్యేలు వివరించారని, ఇది నిజమేనా అంటూ సుప్రీం కోర్టు స్పీకర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది.
ఈ విషయంలో స్పీకర్ అఫిడవిట్ సమర్పించారని, రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు తాము వస్తున్నామని తన అనుమతి తీసుకోలేదని, కనీసం అపాయింట్ మెంట్ కోరలేదని స్పీకర్ అఫిడవిట్ సమర్పించారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ముందు వివరించారు.
స్పీకర్ హక్కుల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని, అయితే ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించడంలో ఎందుకు ఆలస్యం అవుతోంది అని సుప్రీం కోర్టు స్పీకర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది. ఎమ్మెల్యేల రాజీనామాలను అంగీకరించకుండా స్పీకర్ ను అడ్డుకుంటున్నది ఎవరు ?, ఏదైనా శక్తి ఉందా ? అని సుప్రీం కోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది.
24 గంటల్లోపు రాజీనామాలు అంగీకరించడంలో స్పీకర్ ఎందుకు ఆలస్యం చేశారని, అనర్హత విషంలో నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అయ్యిందని సుప్రీం కోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రశ్నించింది. రేపు రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు అంగీకరించే విషయంలో, వారి అనర్హత విషయంలో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకుంటారని న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టులో చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేల అర్జీ విచారణ వాదనలను న్యాయస్థానం మద్యాహ్నంకు వాయిదా వేసింది.