బీజేపీకి షాక్ మీద షాక్: నిన్న కాంగ్రెస్ లోకి జంప్, నేడు ఏజెంట్లు మాయం, పోలింగ్ కేంద్రాలు !
బెంగళూరు: శాసన సభ ఉప ఎన్నికలకు రెండు రోజుల ముందు బీజేపీ నాయకులకు సినిమా చూపించి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన అభ్యర్థి ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చాడు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు లేకుండా చేసి బీజేపీ నాయకులకు షాక్ మీద షాక్ ఇచ్చాడు.
ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లు లేకపోవడంతో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల నాయకులు మాత్రమే పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లుగా ఉన్నారు. కర్ణాటకలోని రామనగర శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ కు సీటు కేటాయించారు.
గురువారం (నవంబర్ 1) చంద్రశేఖర్ శాసన సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామికి ఉప ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నానని చంద్రశేఖర్ ప్రకటించడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
ఇన్ని రోజులు బీజేపీ నాయకులు చేసిన ప్రచారం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. చంద్రశేఖర్ చేసిన పనికి బీజేపీ నాయకులు ఇంకా తేరుకోలేదు. చంద్రశేఖర్ ఫ్లక్సీలు, దిష్టిబోమ్మలను బీజేపీ కార్యకర్తలు దహనం చేశారు.
చంద్రశేఖర్ ఫోటోలకు చెప్పుల హారాలు వేసి ఊరేగింపు చేశారు. అయితే నంబర్ 3వ తేదీ శనివారం పోలింగ్ కేంద్రాల్లో నియమించాల్సిన ఏజెంట్లను సైతం ఉపసంహరించుకున్న చంద్రశేఖర్ బీజేపీ నాయకులకు మరోసారి షాక్ ఇచ్చాడు. పోలింగ్ కేంద్రాల్లో కనీసం ఏజెంట్లు కూడా లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు.