కాంగ్రెస్-జేడీఎస్ జతకడితే మోడీ-అమిత్ షాలకు చుక్కలే!: ఇదీ లెక్క, 2019లో బీజేపీకి కోలుకోలేనిదెబ్బే!!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీని గవర్నర్ పిలిచి ప్రభుత్వ ఏర్పాటు గురించి అడగాల్సి ఉంటుంది. మరోవైపు, జేడీఎస్ - కాంగ్రెస్ మాత్రం తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని, తమనే పిలవాలని చెబుతున్నాయి.
మేమంతా ఒక్కటి: బీజేపీకి రేవణ్ణ షాక్, బీజేపీ రూ.100 కోట్ల ఆఫర్ చేసింది, గవర్నర్ వద్దకు కుమారస్వామి
కానీ కుమారస్వామిని సీఎంగా చేస్తుండటంతో కాంగ్రెస్లోని కొందరు, దానికి తోడు జేడీఎస్లోని కొందరి అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. రాజకీయాల్లో ఇది సరికాదని చెబుతూనే, అన్ని పార్టీలు ఇలాగే వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్, జేడీఎస్ కలిసి పోటీ చేస్తే ఎలా ఉండేది, 2019లో ఎలా ఉంటుందనే ఆసక్తికర చర్చ సాగుతోంది.
జేడీఎస్-కాంగ్రెస్ దోస్తీ కడితే బీజేపీకు చుక్కలే
అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ - జేడీఎస్ - బీఎస్పీ దోస్తీ కడితే బీజేపీ సీట్లు తగ్గేవని అంటున్నారు. కమలం పార్టీకి ప్రస్తుతం 104 సీట్లు వచ్చాయి. అవి 68కి తగ్గేవని అంటున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే ఒక్క బీజేపీని సులభంగా తప్పించి, నెగ్గేవారని అంటున్నారు. అప్పుడు ఆ పార్టీలకు 156 సీట్లు వచ్చేవని చెబుతున్నారు. ఇక్కడ ఓ ట్విస్ట్ కూడా ఉంది. కలిసి పోటీ చేసినప్పుడు రెండు పార్టీల మధ్య అసంతృప్తుల గొడవ ఉంటుంది. అప్పుడు బీజేపీకి ప్రస్తుతం వేస్తున్న లెక్క ప్రకారం నష్టం జరిగేదా లేక ఆ పార్టీల పొత్తు కారణంగా అసంతృప్తుల బెడద పెరిగి బీజేపీకి లాభించేదా అనేది కూడా ప్రశ్నే. ఇలా రెండు లేదా మూడు పార్టీలు ఒక్కటైనప్పుడు టిక్కెట్ దక్కని వారు రెబల్గా పోటీ చేస్తే వ్యతిరేక పార్టీకి లాభం అవుతుంది.
ఈ లెక్కన బీజేపీకి ఆరు సీట్లే వస్తాయి
అసంతృప్తుల లెక్క పక్కన పెడితే, ఈ లెక్కన జేడీఎస్ -కాంగ్రెస్ వీటికి తోడు బీఎస్పీ కలిస్తే 2019లో ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఏ మేర నష్టం ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ఓట్లను కలుపుకుంటే కర్నాటకలోని 28 లోకసభ స్థానాలకు గాను బీజేపీ ఆరు స్థానాలనే దక్కించుకునే అవకాశముంది. ప్రస్తుతం కర్నాటకలో బీజేపీకి 17 లోకసభ స్థానాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతపు లెక్క ప్రకారం 6కు పడిపోతే బీజేపీకి పెద్ద నష్టమే.
ఆ ఆరు సీట్లు ఇవే
ఈ లెక్క ప్రకారం కర్నాటకలో బీజేపీ గెలిచే లోకసభ స్థానాలు బాగల్కోట్, హవేరీ, ధార్వాడ్, ఉడుపి-చిక్మగ్లూరు, బెంగళూరు దక్షిణ, దక్షిణ కన్నడలలో గెలుచుకోనుంది. అదే సమయంలో హైదరాబాద్ కర్నాటక, దక్షిణ కర్ణాటకలో ఒక్క సీటు గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు.
కాంగ్రెస్-జేడీఎస్కు డబుల్
2018 అసెంబ్లీ ఎన్నికల ప్రకారం, జేడీఎస్ - కాంగ్రెస్ 22 స్థానాలు గెలుచుకుంటుంది. 2014లో గెలిచిన వాటికి ఇది రెండింతలు. అయితే, అసంతృప్తులు పెరిగితే, రెబల్స్ రంగంలోకి దిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని ఇక్కడ పరిశీలించవలసి ఉంటుంది. యూపీలో ఎస్పీ - బీఎస్పీలు కలిసి బీజేపీని ఓడించినట్లే కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీయులు కలిసి బీజేపీకి ఓడించవచ్చునని అంటున్నారు.