కర్నాటకలో సస్పెన్స్: ఆ ఇద్దరు కూడా జేడీఎస్-కాంగ్రెస్కు మద్దతు
కర్నాటక ఎన్నికలు: బెంగళూరు: కర్నాటక ఎన్నికలలో ఓటర్లు ఎవరికీ పూర్తి మెజార్టీ ఇవ్వలేదు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అన్ని సర్వేలు చెప్పినట్లుగా జేడీఎస్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశాయి. మరోవైపు, బీజేపీ కూడా జేడీఎస్తో చర్చలు జరుపుతోంది.
కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం: రంగంలోకి సోనియా, ఆఫర్కు దేవేగౌడ ఓకే
కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు మాయావతి, మమతా బెనర్జీ వంటి వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్తో కలిసి వెళ్లమని సూచించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు, స్వంతంత్ర్య అభ్యర్థులు ఇద్దరు జేడీఎస్కు మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. తాము జేడీఎస్కు మద్దతిస్తామని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు జేడీఎస్కు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ఇరు పార్టీల నేతలు గవర్నర్ను కలుస్తారన్నారు. జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామితో ఫోన్లో చర్చలు జరిపామని, వారిద్దరూ తమ ప్రతిపాదనను అంగీకరించారన్నారు. కాగా, గవర్నర్ను కాంగ్రెస్ - జేడీఎస్ నేతలు కలవనున్నారు.
బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా సాధారణ మెజార్టీ సాధించలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ ఢిల్లీలో భేటీ కానుంది. ఇప్పటికే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా నివాసానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పను ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం సూచించింది. జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడంతో బీజేపీ భేటీ కీలకంగా మారింది.