చేతులు కట్టుకుని వెనుక నిలబడిన సీఎం సిద్దరామయ్య: పరిస్థితులు తారుమారు, దూరం పెట్టాలి!
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో (2018) 120 సీట్లకుపైగా విజయం సాధించి అధికారంలోకి వస్తామని ఇంతకాలం ఆత్మవిశ్వాసంతో చెప్పిన సీఎం సిద్దరామయ్య మంగళవారం మౌనంగా ఉన్నారు. విదిలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ కు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది. ఆ సమయంలో సీఎం సిద్దరామయ్య దీనంగా మీడియా ముందు దర్శనం ఇచ్చారు.
సిద్దూ అతి విశ్వాసం
120 సీట్లకు పైగా తమకు వస్తాయని, మళ్లీ అధికారంలోకి వస్తామని సీఎం సిద్దరామయ్య ధీమా వక్తం చేస్తూ వచ్చారు. అయితే సీఎం సిద్దరామయ్య అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఆయన పద్దతి మార్చుకొవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొందరు పదేపదే విమర్శిస్తూ వచ్చారు.
చేతులు కట్టుకున్న సీఎం
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాత కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్. జీ పరమేశ్వర్ మంగళవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ పార్టీకి తాము మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ సయయంలో కేపీసీసీ అధ్యక్షుడి వెనుక సీఎం సిద్దరామయ్య చేతులు కట్టుకుని మౌనంగా నిలబడి ఉన్నారు.
గౌడ తలుపు తట్టిన సిద్దూ
ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్య మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, ఆయన కుమారుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు జేడీఎస్ కు మద్దతు ప్రకటించడానికి సీఎ: సిద్దరామయ్య మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఇంటి తలుపు తట్టాల్సిన పరిస్థితి ఎదురైయ్యింది.
అత్తకు ఒక రోజు కోడలుకు ఒక రోజు
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సిద్దరామయ్య వీలుచిక్కినప్పుడు ప్రతిసారి మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామిని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ బయలుదేరిన బీజేపీని అడ్డుకోవడానికి ఆదిష్టానం ఆదేశాలతో సీఎం సిద్దరామయ్య అదే కుమారస్వామి ఇంటి గడప తొక్కడానికి సిద్దం అయ్యారు. అత్తకు ఒక రోజు, కోడలకు ఒక రోజు అంటే ఇదేనేమో అంటు పలువురు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
సిద్దరామయ్యకు సినిమా
కాంగ్రెస్ మద్దతుతో హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రి అయితే ఇక సీఎం సిద్దరామయ్య ఆటలు సాగవని, కచ్చితంగా ప్రభుత్వానికి దూరం పెడుతారని ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. హెచ్.డి. కుమారస్వామి తన మార్కు రాజకీయాలు మొదలు పెట్టి పార్టీకి పూర్వవైభవం తీసుకు వచ్చే అవకాశం ఉందని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.