‘ఎమ్మెల్యేలను వెంటాడుతున్నారు.. మమ్మల్ని టచ్ చేస్తే.. ప్రజాస్వామ్యం ఖూనీ’
కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కన్నడనాట రాజకీయ ఆట ఊపందుకొన్నది. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంతో బీజేపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నది. అసంతృప్త జేడీఎస్, కాంగ్రెస్ అభ్యర్థులపై బీజేపీ అధిష్టానం దృష్టిపెట్టినట్టు వార్తలు వెలువడుతున్నాయి. దీంతో బెంగళూరులో క్యాంపు రాజకీయాలు ఊపందుకొన్నాయి. మా ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారని బీజేపీపై జేడీఎస్, కాంగ్రెస్ నిప్పులు చెరిగాయి. మీడియాతో పలువురు నేతలు మాట్లాడుతూ..
బీజేపీ కుట్రలు
మా ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారు. వారు ఎంత ఆఫర్ చేస్తున్నారో మాకు తెలియదు. అయితే బీజేపీ కుట్రలను మా ఎమ్మెల్యేలు భగ్నం చేస్తున్నారు. మేమంత ఐక్యంగా ఉన్నాం. మా పార్టీని ఎవరూ టచ్ చేయలేరు. మా ఎమ్మెల్యేలంతా పార్టీకి విధేయులుగా ఉన్నారు అని జేడీఎస్ నేత శరవణ మీడియాతో అన్నారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు
ప్రభుత్వ ఏర్పాటుకు జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి కావాల్సినంత మెజారిటీ ఉంది. గవర్నర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారు. తన విధులను దుర్వినియోగం చేస్తుననారు. మెజారిటీ ఉన్న కుమారస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. అలా కాకుండా గవర్నర్పై ఒత్తిడి పెంచి బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టే అని జేడీఎస్ ప్రధాన కార్యదర్శ డానిష్ అలీ అన్నారు.
ప్రభుత్వం మాదే..
ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు. ఏ ఒక్కరూ మా క్యాంపుకు దూరంగా లేరు. గ్యారంటీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
బీజేపీపై ఆజాద్ ఆగ్రహం
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. డబ్బు ఆశజూపి మా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. బీజేపీ వైపు వెళ్లడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారనే వార్తలో వాస్తవం లేదు అని గులాం నబీ ఆజాద్ వెల్లడించారు.