కర్ణాటకలో బీజేపీ గెలుపు.. తెలుగు సీఎంలకు చుక్కెదురు!
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ, ఏపి ముఖ్యమంత్రులను ఖంగుతినేలా చేసాయి. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కన్నడ ప్రజానికానికి పిలుపునిచ్చి బొక్కబోర్లా పడ్డారు. తెలుగు రాష్ట్రాల పట్ల గుర్రుగా ఉన్న మోడీ ఈ దెబ్బతో ఎలా వ్యవహరిస్తారోనని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం.
బెడిసి కొట్టిన చంద్రబాబు, కేసీఆర్ వ్యూహాలు.
కర్ణాటక సార్వత్రిక ఎన్నిక ఫలితాలు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలను నెవ్వరపరిచాయి. ఏపి, తలెంగాణ రాష్ట్రాలను మోడీ నిర్లక్ష్యం చేస్తున్నారంటూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ బీజెపి కి ఓటు వేయొద్దని కర్ణాటక ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రస్తుత ఫలితాలు మాత్రం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉత్కంఠకు గురిచేసాయి. తెలుగు రాఫ్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పలు వేదికలపైన మోడీని నిలదీసిన సందర్బాలు ఉన్నాయి.
కర్ణాటకలో బీజేపీ విజయం సాధిస్తే..
కర్ణాటకలో బీజెపి పరాజయం పొందితే విజయ గర్వం నుండి మోడీ వాస్తవ పరిస్థితిలోకి వస్తారని, తెలుగు రాష్ట్రాల అవసరాలను అవగతం చేసుకుంటారని చంద్రబాబు , కేసీఆర్ ప్రణాళిక రచించారు. అందుకు అనుగుణంగానే బీజెపికి వ్యతిరేకంగా పావులు కదిపారు. కాని కర్ణాటక ప్రజలు మాత్రం అదికారం లో ఉన్న కాంగ్రేస్ ను కాదని కమలం పార్టీకి జై కొట్టారు. దీంతో మోడీ, అమీత్ షాల ద్వయం మరో సారి విజయాన్ని సొంతం చేసుకుంది.
తెలుగు రాష్ట్రాలపై మోదీ అస్పష్ట వైఖరి.
కర్ణాటకలో బీజెపి విజయం ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా తయారయింది. ఎన్నికలు జరుగుతున్న ప్రతి రాష్ట్రంలో కాషాయం జెండా పాగా వేస్తూ రావడాన్ని ఇరు ముఖ్యమంత్రులకు అంతగా రుచించడం లేదు. గెలుపోటములు ఎలా ఉన్నా తెలుగు రాష్ట్రాలకు సరైన న్యాయం చేస్తే అంతగా పట్టించుకునే పరిస్థితులు ఉండేవి కాదని తెలుస్తోంది. రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కేంద్ర బడ్జెట్ లో సరైన గుర్తింపు ఇవ్వకుండా, నిదులు సక్రమంగా విడుదల చేయకుండా మోడీ ఏకపక్ష దోరణి అవలంబిస్తున్నారంటూ ఎన్నో సందర్బాల్లో గొంతెత్తి చాటారు. మోడీ ఒంటెద్దు పోకడకు కర్ణాటక ఎన్నికతో అడ్డుకట్ట వేయాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు కూడా రచించారు. బీజేపి తో పాటు కాంగ్రెస్ పార్టీ అదికారంలో కి వచ్చినా రెండు తెలుగు రాఫ్ట్రాలకు పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. బీజేపి. కాంగ్రేస్ రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దయెత్తున విరుచుకుపడ్డారు. దీంతో కర్ణాటకలో అటు బీజేపి ఇటు కాంగ్రేస్ ఏది అదికారంలోకి వచ్చినా ప్రయోజనం మాత్రం శూన్యమే.
కర్ణాటక విజయం దక్షిణ రాఫ్ట్రాల పై ప్రభావం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకడుగు ముందుకేసి జెడీయస్ పార్టీని గెలిపించాలని కన్నడ ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసారు. అటు చంద్రబాబు కూడా తెలుగుదేశం నాయకులను కర్ణాటక కు పంపించి బీజెపి కి తప్ప ఏ పార్టీకైనా ఓటు వేయాల్సిందిగా కర్ణాటక లోని తెలుగు ప్రజలకు చెప్పించే ప్రయత్నం చేసారు. కానీ మోడీ శక్తి, అమీత్ షా యుక్తి ముందు ఎవ్వరి పాచికా పారలేదు. ముందుగా వేసుకున్న వ్యూహం ప్రకారం తెరవెనక అన్నీ తానై వ్యవహరించిన అమిత్ షా, పోలింగ్ కు 10 రోజుల ముందునుండి మోడీ నిర్వహించిన సుడిగాలి పర్యటనలు, స్థానిక సమస్యల ప్రస్థావనలు బీజెపికి బాగా కలిసొచ్చాయి. కర్ణాటక గెలుపు ప్రభావం దక్షిణాది రాష్ట్రాల పై పడే అవకాశం లేకపోలేదు.
మోడీ మాటే శాసనం
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో అంటిముట్టనట్టుగా ఉంటున్న మోడీ కన్నడ విజయంతో ఇంకెంత బిగిసుకుపోతారో అనే సందేహాలు ఇద్దరు చంద్రుల్లో కలుగుతున్నాయి. బీజెపి కి వ్యతిరేకంగా పనిచేయలని పిలుపునిచ్చి మోడీతో వైరాన్ని మరింత జటిలం చేసుకున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. కేంద్ర సహాయ సహకారాలు లేకుండా రాష్ట్రాలు స్వయంగా సర్వతోముఖాభివ్రుద్ది సాదించగలిగిన సందర్బాలు చాలా అరుదు. ఇలాంటి నేపద్యంలో లోటు బడ్జెట్ లో ఉన్న ఆంద్రప్రదేశ్ ను నెట్టుకొస్తున్న చంద్రబాబు కు, రాష్ట్ర సమగ్ర అభివ్రుద్ది కోసం అలుపెరగని క్రుషి చేస్తున్న కేసీఆర్ కు మోడీ ఎంతవరకు చేయూత అందిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.