2+1పై మోడీకి సిద్ధూ కౌంటర్, అందుకే బీజేపీ అధికారంలోకి రాదు: ప్రకాశ్ రాజ్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. ఎన్నో కుంభకోణాల్లో కూరుకుపోయిన యెడ్డీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని, మీతోపాటు ర్యాలీలలో ఆయన పాల్గొనబోవడం లేదని వార్తలు వచ్చాయని గుర్తు చేశారు.
ఇప్పటీకీ యడ్యూరప్పనే ముఖ్యమంత్రి అభ్యర్థా చెప్పాలని ప్రశ్నించారు. తన ప్రశ్నకు సమాధానం కావాలన్నారు. తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు టిక్కెట్లు ఇప్పించుకున్న గాలి జనార్ధన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ.. మీ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆయన ఉంటారా చెప్పాలని ప్రశ్నించారు. కర్నాటక ప్రజలు తమ చెవులలో కమలాలను పెట్టుకోలేదన్నారు.
కర్నాటక ఎన్నికలు-తాజా సర్వే: బీజేపీకి ఎక్కడ దెబ్బ, కాంగ్రెస్కు ఎక్కడ ప్లస్?
రెండు స్థానాల నుంచి పోటీపై సిద్ధరామయ్య కౌంటర్
సిద్ధరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు విమర్శించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. గత లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి, వదోదరల నుంచి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ఓడిపోతాననే భయంతోనే అప్పుడు మోడీ రెండు స్థానాల నుంచి పోటీ చేశారన్నారు.
కర్నాటక కాంగ్రెస్ ట్వీట్
సిద్ధరామయ్య రెండు స్థానాల నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. మోడీ ప్రచారంలో భాగంగా 2+1 అని సిద్ధూపై విమర్శించారు. బీజేపీ కరప్షన్ ఫార్ములా అంటూ 2+1= ఇద్దరు రెడ్డిలు, ఒక యెడ్యూరప్ప అని కర్నాటక కాంగ్రెస్ సెటైర్ వేసింది. మోడీ ఈ ఫార్ములా గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
దక్షిణాదిన ఇక బీజేపీ అధికారంలోకి రాదు
కర్నాటకలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని, విభజించి పాలించే అధికారాన్ని ఎవరూ కోరుకోరని, మనది ప్రజాస్వామ్య దేశమని నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఇక్కడ అందరికీ చోటు ఉంటుందని, స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఏ మతానికో, కులానికో ఈ దేశం పరిమితం కాదన్నారు. దక్షిణాదిన బీజేపీ ఇక అధికారంలోకి రాదన్నారు. వారి సిద్ధాంతాలు ఇక్కడ పని చేయవన్నారు.
మోడీ హెచ్చరికలు జారీ చేశారు కానీ
నరేంద్ర మోడీ వారి పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశారని, దీనిని నేను ఖండిస్తున్నానని, మోడీజీ.. వారిని మాట్లాడనివ్వండి, వారి మనసులో ఏముందో తెలుస్తుందని ప్రకాశ్ రాజ్ అన్నారు. మోడీ నేతల నోళ్లు మూయించినా వారు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారన్నారు.
అందుకే బీజేపీ గెలవదు
బీజేపీ విభజన రాజకీయాలు చేయలేదని నిరూపించాలని ప్రకాశ్ రాజ్ సవాల్ చేశారు. దీనికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నాయకులు చెప్పే మాటలను బట్టి నమ్మవద్దని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తే వారి మాట వినాలన్నారు. యెడ్డీ సహా పలువురు బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాదన్నారు. మోడీ ఓటమి కర్నాటక నుంచి ప్రారంభమైందని, 2019లో ఆయన ప్రధాని కాలేరన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ గత కొంతకాలంగా బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే.