అడవులను రక్షించేందుకు 'చెట్లు లేకుంటే, నీళ్లు లేవు' నినాదంతో కార్యక్రమం
బెంగళూరు: కర్ణాటకలోని ఎన్విరాన్మెంటల్ గ్రూప్ రాష్ట్రంలోని చెట్లను కాపాడేందుకు కృషి చేస్తోంది. భావితరాలకు నీరు లేకుండా చేయవద్దని అందరినీ జాగృతం చేసే ప్రయత్నాలు చేస్తోంది. 'చెట్లు లేకుంటే నీళ్లు ఉండవు' (నో ట్రీస్.. నో వాటర్) నినాదంతో ముందుకు సాగుతోంది.
దేశంలోనే రాజస్థాన్ తర్వాత డ్రై ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రంలోని 176 తాలుకాలకు గాను 156 తాలుకాలను 2018లో కరువు మండలాలుగా ప్రకటించారు. కేవలం 20 తాలుకాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం ఉండటం నిజంగా షాకింగ్కు గురిచేసే అంశం.
మరోవైపు, కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల చెట్లను అభివృద్ధి పేరిట నరికేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అడవులను కాపాడుకునేందుకు కర్ణాటకలోని ఇరవై మూడు పర్యావరణ గ్రూపులు యునైటెడ్ కన్జర్వేషన్ మూవ్మెంట్ (యూసీఎం) పేరుతో ఏకతాటి పైకి వచ్చాయి. ఈ నెల 16వ తేదీన 'చెట్లు లేకుండే, నీళ్లు లేవు' పేరుతో ఫ్రీడమ్ పార్క్లో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.
రాష్ట్రవ్యాప్త ర్యాలీని చేపడుతున్నట్లు పర్యావరణవేత్తలు చెప్పారు. అడవులు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని చెప్పారు. వెస్టర్న్ ఘాట్స్ను యథాతథంగా ఉంచాలని చెప్పారు. మల్నాడ్ ప్రాంతం (వెస్టర్న్ ఘాట్స్) నుంచి 65 నదులు పుట్టుకు వస్తున్నాయని చెప్పారు. ఇది రాష్ట్రానికి వాటర్ ట్యాంక్ వంటిదని చెప్పారు. ఇప్పుడు దీనిపై దాడి జరుగుతోందన్నారు. కర్ణాటకకు వాటర్ ట్యాంక్ వంటి వెస్టర్న్ ఘాట్ను కొల్లగొడుతున్నారన్నారు.
దీంతోపాటు పలుచోట్ల పలు ప్రాజెక్టుల కోసం 21 లక్షల చెట్లను కొట్టివేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నదుల పరిది తగ్గిందని, ఇలా చెట్లు నరికితే మరింత కరువు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ది వైల్డ్నెస్ క్లబ్, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ఫీల్డ్ స్టడీస్, ఫారెస్ట్ ఫస్ట్, సెంటర్ ఫర్ అవేర్నెస్ అండ్ నేచర్ స్టడీ, నేచర్ ఫస్ట్ ఎకో విలేజెస్, కూర్గ్ వైల్డ్ లైఫ్ సొసైటీ, సేవ్ కొడగు అండ్ కావేరీ క్యాంపెయిన్, ఐక్యం కమ్యూనిటీ ఫర్ సస్టయినబుల్ లివింగ్, కోలిషన్ ఫర్ వాటర్ సెక్యూరిటీ, సిటిజన్స్ అజెండా ఫర్ బెంగళూరు, క్రికెటర్స్ ఫర్ టైగర్ కన్సర్వేషన్స్ తదితర ఆర్గనైజేషన్లు యూసీఎం (యునైటెడ్ కన్జర్వేషన్ మూవ్మెంట్)ను ఆర్గనైజ్ చేస్తున్నాయి.