స్కాం కేసు: మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్ట్, అనుచరుడు అలీఖాన్ కూడా
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. అంబిడెంట్ స్కాంలో ఆయనను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.18 కోట్ల లంచం కేసులో ఆయనను శనివారం సాయంత్రం నుంచి పోలీసులు విచారించారు. ఆదివారం కూడా విచారించారు. అనంతరం అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి దాకా విచారణ, పొంతనలేని జవాబులతో విసుగెత్తించిన గాలి: పక్కా ప్లాన్తోనే..!
ఆయనను నిన్న సాయంత్రం నుంచి సుదీర్ఘంగా విచారించారు. అర్ధరాత్రి వరకు, ఆ తర్వాత ఆదివారం ఉదయం నుంచి విచారణ జరిపారు. అరెస్టు అనంతరం విక్టోరియా ఆసుపత్రిలో గాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. గాలికి కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. గాలితో పాటు అతని అనుచరుడు అలీఖాన్ను కూడా అరెస్ట్ చేశారు.
గాలిని శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి మూడు గంటల వరకు విచారించారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచే విచారణ ప్రారంభించారు. విచారణకు హాజరైన అంబిడెంట్ ఎండీ షరీఫ్, జనార్ధన్ రెడ్డి, పీఏ అలీఖాన్ను బయటకు పంపించారు. కానీ గాలిని కార్యాలయంలోనే ఉంచారు.
ఈ కేసుతో తనకు సంబంధం లేదని గాలి విచారణలో వెల్లడించారు. ఫరీద్ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం తాను సాయం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. సుదీర్ఘ విచారణ అనంతరం అతని అరెస్టును అధికారులు ప్రకటించారు. సుదీర్గ విచారణలో ఆయన పోలీసులకు సరైన సమాధానాలు ఇవ్వక తికమక పెట్టారు.
కేసుకు సంబంధించి ఆదివారం ఆయనతో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారించారు. గాలి సూచన మేరకు రూ.18 కోట్ల నగదును ఆర్టీజీఎస్ రూపంలో బదలీ చేసేందుకు సహకరించిన బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రిజేష్, ఫైజల్, జయరాంలను కూడా విచారించారు. విచారణకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా, వీడియో రూపంలో సేకరించారు.