ఇంత అవమానామా: కుమారస్వామి ప్రమాణస్వీకారం, సిద్దరామయ్య ఔట్ ఆఫ్ ఫోకస్, ఎంతమార్పు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరుకావడంతో ఆ వేదిక కలకలలాడింది. అయితే 10 రోజుల క్రితం వరకూ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్య మాత్రం వేదిక మీద ఔట్ ఆఫ్ ఫోకస్ అయ్యారు. వేదిక మీద సిద్దరామయ్యను పట్టించుకున్న నాయకుడే కరువయ్యారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రత్యక్ష సాక్షం
బుధవారం సాయంత్రం విధాన సౌధ ముందు భాగంలో ఏర్పాటు చేసిన వేదిక మీద కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత డాక్టర్ జి. పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేశారు. వేలాది మంది జేడీఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షంగా నిలిచారు.
వేదిక మీద ప్రముఖులు
కుమారస్వామి, డాక్టర్ జి. పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత వేదిక మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీతారం ఏచూరి, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, మల్లికార్జున్ ఖార్గే, డీకే. శివకుమార్ తదితరులు కలిసి ఒక్కసారిగా కన్నడిగులకు అభివాదం చేస్తూ ఫోటోలకు ఫోజు ఇచ్చారు.
సిద్దూ కుర్చీకే పరిమితం
సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విధాన సౌధ ముందు ఏర్పాటు చేసిన వేదిక మీదకు వచ్చారు. ఆ సమయంలో వారికి అభివాదం చేసిన సిద్దరామయ్య ఒక్క మాటకూడా మాట్లాడకుండా కుర్చీకే పరిమితం అయ్యారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత కూడా సిద్దరామయ్య ఆయన కుర్చీలోనే మౌనంగా కుర్చున్నారు.
సిద్దూకు అవమానం
కుమారస్వామి, డాక్టర్ జి. పరమేశ్వర్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత వారిని సిద్దరామయ్య అభినందించలేదు. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే. శివకుమార్, కుమారస్వామి చెయ్యి చెయ్యి పట్టుకుని పైకిఎత్తి కార్యకర్తలకు అభివాదం చేశారు.
ఒక్కరూ పట్టించుకోలేదు
విధాన సౌధ ముందు ఏర్పాటు చేసిన వేదిక మీద కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ప్రాంతీయ పార్టీల నాయకులు అందరూ కలిసి చేతులు పైకిఎత్తి కన్నడిగులకు అభివాదం చేశారు. ఆ సమయంలో కుమారస్వామి కూడా వారితో ఉన్నారు. ఆ సందర్బంలో ఒక్కనాయకుడు కూడా సిద్దరామయ్య ముందుకు రావాలని ఆహ్వానించకపోవడంతో ఆయన వెనుకనే మౌనంగా ఉండిపోయారు.
ఇంతలో ఎంత మార్పు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో రాహుల్ గాంధీ అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పక్కనే నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంలో రాహుల్ గాంధీ సిద్దరామయ్యను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అయితే కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వచ్చిన రాహుల్ గాంధీ వేదిక మీద ఉన్న సిద్దరామయ్యను చూసిచూడనట్లు వెళ్లిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అభిమానులు అసహనం
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు సిద్దరామయ్య పట్ల చూపించిన నిర్లక్షం సహించలేకపోతున్నామని సిద్దరామయ్య అభిమానులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్న సిద్దరామయ్యను బహిరంగంగా ఓ వేదిక మీద ఇలా అవమానిస్తారా అంటూ ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.