ప్రతిపక్షాలు కుట్రలు: ఓడిపోయాను, జేడీఎస్ కు అందుకే, సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు
బెంగళూరు: ప్రతిపక్షాలు కుట్రలు చెయ్యడం వలనే మైసూరు జిల్లా చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో తాను ఓడిపోయానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. తాను ఐదు సంవత్సరాలు ప్రజల కోసం ఎంతో శ్రమించానని, ఆ విషయం జీర్ణించుకోలేక తనను ఓడించారని సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
మైసూరు జిల్లా చాముండేశ్వరి శాసన సభ నియోజక వర్గంలో సిద్దరామయ్యను జేడీఎస్ నాయకుడు జీటీ. దేవేగౌడ 35,000 వేలకు పైగా మేజారిటీతో చిత్తుచిత్తుగా ఓడించారు. బాగల్ కోటే జిల్లా బాదామి శాసన సభ నియోజక వర్గంలో బళ్లారి శ్రీరాములు మీద స్వల్ప మెజారిటీతో సిద్దరామయ్య విజయం సాధించి ఊపిరిపీల్చుకున్నారు.
తనను ఎమ్మెల్యేగా గెలిపించిన బాదామి ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడానికి సిద్దరామయ్య ఆ నియోజక వర్గంలో సంచరిస్తున్నారు. శుక్రవారం స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సిద్దరామయ్య చాముండేశ్వరి నియోజక వర్గం ప్రజలను మభ్యపెట్టి తనకు ఓటు వెయ్యకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేశాయని ఆరోపించారు.
బాదామి ప్రజలు ప్రతిపక్షల కుట్రలకు లొంగకుండా తనను గెలిపించారని సిద్దరామయ్య వారికి కృతజ్ఞతలు చెప్పారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలోనే సిద్దరామయ్య ఆరోపణలు చేస్తున్నారు. కర్ణాటకలో మతతత్వ బీజేపీ అధికారంలోకి రాకూడదనే ఒక్క కారణంతో జేడీఎస్ కు సీఎం పదవి అప్పగించామని సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.