ఆంబిడెంట్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం, రహస్యంగా వీడియో, వైరల్, లాయర్లు!
Recommended Video
బెంగళూరు: ఆండిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సీసీబీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే విచారణ హాజరుకావాలని భావించిన గాలి జనార్దన్ రెడ్డి శనివారం తన న్యాయవాది చంద్రశేఖర్ తో కలిసి రహస్య ప్రాంతంలో ఓ వీడియో తీసి విడుదల చెయ్యడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను ఎక్కడికి పారిపోలేదని, బెంగళూరులో ఉన్నానని, పోలీసులు పుకార్లు పుట్టించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారా ? లేదా ? అంటూ ఆయన అనుచరులు టెన్షన్ పడుతున్నారు.
విచారణకు వస్తా
కొన్ని రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సీసీబీ పోలీసుల ముందు విచారణకు హాజరు అవుతానని ఓ వీడియో తీసి విడుదల చేశారు. ఆదివారం లోపు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు గాలి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే శనివారం బెంగళూరులోని చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు అవుతానని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
కోట్ల రూపాయల స్కాం
ఆంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ యజమాని మహమ్మద్ ఫరీద్ అనేక మందికి కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టారని 2017లో కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. తరువాత ఫరీద్ జామీను మీద బయటకు వచ్చారు. ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు ఆలీఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
జ్యువెలర్స్ షోరూంలు
ఫరీద్, ఆలీఖాన్ తో పాటు బళ్లారిలోని రాజమహల్ జ్యువెలర్స్ కు చెందిన రమేష్, బెంగళూరులోని అంబికా జ్యువెలర్స్ కు చెందిన రమేష్ కోఠారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. ఆంబిడెంట్ కంపెనీ యజమాని ఫరీద్ ను కేసు నుంచి తప్పిస్తానని గాలి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
ఫైవ్ సార్ట్ హోటల్
బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో గాలి జనార్దన్ రెడ్డి, ఫరీద్, ఆలీఖాన్ తదితరులు భేటీ అయ్యారని పోలీసులు అంటున్నారు. ఆ సందర్బంలో ఆంబిడెంట్ కంపెనీ యజమాని ఫరీద్ ను కేసుల నుంచి తప్పిస్తానని గాలి జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారని తెలిసింది.
57 కేజీల బంగారం డీల్
కేసుల నుంచి తప్పించడానికి ఫరీద్ తో గాలి జనార్దన్ రెడ్డి రూ. 20 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. డీల్ లో భాగంగా ఫరీద్ నుంచి రూ. 18 కోట్ల విలువైన 57 కేజీల బంగారం కడ్డీలు గాలి జనార్దన్ రెడ్డి అనుచురుడు ఆలీఖాన్ చేతికి చేరిందని పోలీసులు అంటున్నారు.
ఫలితం లేదు
విచారణలో ఆలీఖాన్, ఫరీద్ ఈ విషయం చెప్పడంతో గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు సిద్దం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గాలి జనార్దన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆరోపణలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి కోసం సీసీబీ పోలీసులు గాలిస్తున్నా ఫలితం లేదని ప్రచారం జరిగింది.
గాలి సంచలన నిర్ణయం
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసుకు సంబంధించి 48 గంటల్లో విచారణకు రావాలని సీసీబీ పోలీసులు గాలి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం న్యాయస్థానంలో గాలి జనార్దన్ రెడ్డికి ముందు జామీను రాలేదు. ఈ నేపధ్యంగాలో న్యాయవాది చంద్రశేఖర్ తదితరులను వెంటపెట్టుకుని సీసీబీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని గాలి జనార్దన్ రెడ్డి నిర్ణయించారని తెలిసింది.