ఎన్నికల వేళ..సరికొత్త ఈక్వేషన్లు: శశికళ రీఎంట్రీ: చెన్నైకి ప్రయాణం: వాట్ నెక్స్ట్?
బెంగళూరు: తమిళనాడులో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఒకట్రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న తమిళనాడులో సరికొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత నెచ్చెలి.. ఉద్వాసనకు గురైన ఏఐఏడీఎంకే నాయకురాలు వీకే శశికళ.. తమిళ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతోన్నారు. ఈ ఉదయం ఆమె బెంగళూరు నుంచి చెన్నైకి బయలుదేరి వెళ్లారు. నాలుగేళ్ల జైలు శిక్ష ముగించుకున్న ఆమె భవిష్యత్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Recommended Video
అక్రమాస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల జైలును శిక్షను అనుభవించిన విషయం తెలిసిందే. బెంగళూరు పరప్పన అగ్రహార కేంద్ర కార్యాలయంలో ఆమె జైలుశిక్షను అనుభవించారు. కిందటి నెల విడుదల అయ్యారు. కరోనా వైరస్ బారిన పడటంతో కొద్ది రోజుల పాటు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బెంగళూరు శివార్లలోని ప్రెస్టీజ్ గోల్ఫ్షైర్ క్లబ్ రిసార్ట్లో విశ్రాంతి తీసుకున్నారు. ఈ ఉదయం చెన్నైకి బయలుదేరి వెళ్లారు. జ్యోతిష్యులు సూచించిన తేదీలోనే ఆమె చెన్నైకి ప్రయాణం అయ్యారు.
సరిగ్గా ఎన్నికల ముంగిట్లో ఆమె విడుదల కావడం వల్ల ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలన్నీ ఆమె చుట్టే కేంద్రీకృతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. జయలలిత కన్నుమూత తరువాత.. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న సమయంలో ఆమె అనూహ్యంగా జైలుపాలయ్యారు. తాజాగా- ఆమె ప్రస్థానం ఎక్కడి నుంచి ఆరంభమౌతుందనేది చర్చనీయాంశమౌతోంది. జైలు పాలైన తరువాత.. అధికార ఏఐఏడీఎంకే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రస్తుతం రాజకీయాల్లో ఆమె ఒకరకంగా ఒంటరిగా మిగిలారు. మేనల్లుడు టీటీవీ దినకరన్ ఒక్కరే ఆమెకు అండ.
ఈ పరిస్థితుల మధ్య శశికళ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. రాజకీయాల్లో కొనసాగడానికి ప్రస్తుతం ఆమెకు ఎలాంటి వేదికా లేదు. టీటీవీ దినకరన్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఏఎంఎంకేను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చుతారని అంటున్నారు. ఏఐఏడీఎంకేలో మళ్లీ రీఎంట్రీ ఇస్తారనేది అనుమానమే. డీఎంకే ఆమెను ఆదరించే అవకాశాలు దాదాపుగా లేకపోవచ్చు. ఫలితంగా- రాజకీయాల్లో కొనసాగాలంటే.. ఏఎంఎంకేను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చడంపైనే ఆమె దృష్టి కేంద్రీకరిస్తారని చెబుతున్నారు. జయలలిత ఓటుబ్యాంకును ఆకర్షించేలా ఏఎంఎంకేను తీర్చిదిద్దే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
రాజ్భవన్ అన్నం: తెలంగాణ గవర్నర్ తమిళిసై వినూత్నం: పేదలకు రెండు పూటల భోజనం