నా కుమారుడిని మీరే ఓడించారు: బహిరంగ సభలో భోరుమన్న మాజీ ముఖ్యమంత్రి
బెంగళూరు: జనతాదళ్ (సెక్యులర్) సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి మరోసారి బహిరంగ సభలో భోరుమన్నారు. తన కుమారుడిని ఎలా ఓడించగలిగారని ఆయన ఓటర్లను ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ప్రజల ప్రేమాభిమానాలే కావాలని కన్నీరు పెట్టుకున్నారు. ప్రజలకు తాను ఎలాంటి ద్రోహం చేశానో అర్థం కావట్లేదని ఆయన విలపించారు. కర్ణాటకలోని మండ్యలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
నిజానికి మండ్య జిల్లా జనతాదళ్ (ఎస్) పార్టీకి కంచుకోట. అయినప్పటికీ.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి పోటీ చేసిన కన్నడ యువ నటుడు, కుమారస్వామి తనయుడు హెచ్ డీ నిఖిల్ గౌడ ఓటమి పాలయ్యారు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి, దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత చేతిలో నిఖిల్ గౌడ పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ తన కుమారుడిని గెలిపించుకోలేకపోయారు.
ఎన్నికలు ముగిసిన ఇన్ని రోజుల తరువాత.. కుమారస్వామి తొలిసారిగా మండ్య జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మండ్యలో బహిరంగ సభలో ప్రసంగించారు. తన కుమారుడి ఓటమి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తన కుమారుడిని ఎన్నికల బరిలో దింపాలని తాను ఏ మాత్రం అనుకోలేదని, జిల్లా ప్రజలు, పార్టీ అభిమానులు, కార్యకర్తల ఒత్తిడి మేరకు పోటీ చేయించానని అన్నారు. అయినప్పటికీ.. ప్రత్యక్షంగా తన కుమారుడిని, పరోక్షంగా తనను ఓడించారని అన్నారు.
తాను పదవులను పట్టుకుని వేలాడే నాయకుడిని కాదని, ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తాననే విషయం జిల్లా ప్రజలకు బాగా తెలుసునని, అయినప్పటికీ తనకు ఓటమిని మిగిల్చారని కుమారస్వామి కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల కోరిక మేరకు పోటీ చేసినప్పటికీ.. ఓడిపోవడమే తనను కలచి వేస్తోందని అన్నారు. తన కుమారుడు ఎలా ఓడిపోయాడనేది ఇప్పటికీ తనకు అర్థం కావట్లేదని, ఈ ఓటమి నుంచి గుణపాఠాలను నేర్చుకోవడానికి తాను, తన కుటంబం సిద్ధంగా ఉందని అన్నారు.
జిల్లా రైతుల సంక్షేమం కోసం తాను అహర్నిశలు శ్రమించానని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో ఒక్క మండ్య జిల్లాలోనే 26 కోట్ల రూపాయల మేర వడ్డీ రుణాలను మాఫీ చేయడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై మీడియా ఏనాడూ కథనాలు రాయలేదని అన్నారు. ఈ ఏడాద ఫిబ్రవరిలో మండ్య జిల్లా కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించానని చెప్పారు. ప్రత్యేక నిధులను కేటాయించి, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసినట్లు చెప్పారు. అయినప్పటికీ.. తన కుమారుడి ఎలా ఓడించారని అన్నారు.
#WATCH JD(S) leader HD Kumaraswamy breaks down, in Mandya. Says "...I don't need politics, don't want CM post.I just want your love.I don't know why my son lost.I didn't want him to contest from Mandya but my own people from Mandya wanted him but didn't support him which hurt me" pic.twitter.com/reyhIsttPN
— ANI (@ANI) November 27, 2019