కొడుకును ఎమ్మెల్యే చేస్తానని మాజీ సీఎం ప్రతిజ్ఞ, సుమలత చేతిలో ఓటమి, రెబల్ ఎమ్మెల్యే!
బెంగళూరు: కొడుకును ఎమ్మెల్యే చెయ్యాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కసితో ఉన్నారని తెలిసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇవ్వకూడదని జేడీఎస్ నిర్ణయించింది. కొడుకుని ఎంపీగా చెయ్యలేకపోయాననే నిరాశతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చివరికి అతన్ని ఎమ్మెల్యే చెయ్యాలని ప్రతిజ్ఞ చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో మండ్య నియోజక వర్గం నుంచి కుమారస్వామి కుమారుడు, ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామి పోటీ చేశారు. అయితే బహుబాష నటి సుమలతా చేతిలో నిఖిల్ కుమారస్వామి ఓడిపోయారు. ఇదే సమయంలో కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ సైతం తుమకూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కుమారస్వామి సోదరుడు, మాజీ మంత్రి హెచ్.డి. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ మాత్రమే హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని జేడీఎస్ పార్టీ నుంచి పోటీ చేయించి ఎమ్మెల్యే చెయ్యాలని మాజీ సీఎం కుమారస్వామి నిర్ణయించారని తెలిసింది.
కేఆర్ పేట్ ఉప ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామిని పోటీ చేయించాలని కుమారస్వామి నిర్ణయించారని తెలిసింది. కేఆర్ పేట్ నియోజక వర్గం ప్రజలతో ఇప్పటికే మంతనాలు జరిపుతున్న మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి త్వరలో ఓ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్ నియోజక వర్గం కాకుండా జేడీఎస్ ఎక్కువ బలం ఉన్న కేఆర్ పేట్, హుణసూరు నియోజక వర్గాల్లో ఒక చోట నిఖిల్ కుమారస్వామిని రంగంలోకి దింపాలని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి జేడీఎస్ వర్గాలు సలహా ఇచ్చాయని సమాచారం.
జేడీఎస్ కు కంచుకోట అయిన కేఆర్ పేట్ నియోజక వర్గం నుంచి నిఖిల్ కుమారస్వామి పోటీ చేసే అవకాశం ఉందని తెలిసింది. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం అయిన కేఆర్ పేట్ ఎమ్మెల్యే నారాణగౌడ మీద పగ తీర్చుకోవడానికి జేడీఎస్ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని సమాచారం. కేఆర్ పేట్ నియోజక వర్గం ప్రజల అభిప్రాయం తెలుసుకుని నిఖిల్ కుమారస్వామిని అక్కడి నుంచి పోటీ చేయిస్తామని జేడీఎస్ నాయకులు అంటున్నారు.