నా మొదటి శత్రువు సిద్దూ, సీఎం కాదు గుమస్తా, కుమారస్వామి, చేతకాకుంటే: సిద్దరామయ్య!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర సీఎల్ పీ నేత సిద్దరామయ్య మీద గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మాజీ ప్రధాని కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తన మొదటి శత్రువు సిద్దరామయ్య, బీజేపీ కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉండి పరిపాలించడం చేతకాని వాళ్లు ఇలాగే మాట్లాడుతారని పరోక్షంగా మాజీ సీఎం కుమారస్వామి మీద సిద్దరామయ్య మండిపడ్డారు.
కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం
కర్ణాటకలో 13 నెలలకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తరువాత కుప్పకూలిపోయింది. తాను సీఎంగా ఉండటం సిద్దరామయ్యకు ఇష్టం లేదని, అందుకే ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణం అయ్యారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు.
నా మొదటి శత్రువు సిద్దూ
సిద్దరామయ్య నా మొదటి శత్రవు, బీజేపీ మాత్రం కాదు అని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద గత కొన్ని రోజుల నుంచి జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్,డి దేవేగౌడ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్య ప్రధాన కారణమని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఆరోపించారు.
సినిమా చూపించారు
మాజీ సీఎం సిద్దరామయ్య ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారని, చివరికి వారి చేత రాజీనామాలు చేయించారని, సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దరామయ్య కారణం అయ్యారని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మండిపడ్డారు.
కాంగ్రెస్ హైకమాండ్
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ అధిస్టానం సూచించిందని, ఇష్టం లేకపోయినా బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య తదితర కాంగ్రెస్ నేతలు అంగీకరించారని మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఆరోపించారు.
సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు
సిద్దరామయ్య ఒత్తిడి మేరకే కర్ణాటక ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణకు ఆదేశించిందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు తన మీద పెత్తనం చేశారని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు అన్ని విభాగాల అధికారుల బదిలీలు వారు చెప్పినట్లు చేశానని కుమారస్వామి చెప్పారు.
నేను సీఎం కాదు గుమస్తా
కాంగ్రెస్ లోని కొందరు నాయకులు (సిద్దరామయ్య అండక్ కో ) తన మీద పగ పెంచుకున్నారని కుమారస్వామి ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా గుమస్తాలా పనిచేశానని మాజీ సీఎం కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు.
చేతకాకుంటే ఇంతే
అధికారంలో ఉండి ప్రభుత్వాన్ని పరిపాలించడం చేతకాకుంటే ఇలాగే మాట్లాడుతారని పరోక్షంగా మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి మీద సిద్దరామయ్య మండిపడ్డారు. తాను మౌనంగా ఉంటే తన మీద పదేపదే విమర్శలు చేస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతానని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, మాజీ సీఎం కుమారస్వామి మీద సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని గుర్తు పెట్టుకుని ఆరోపణలు చేస్తే మీకే మంచిదని తండ్రి కొడుకులకు సిద్దరామయ్య సూచించారు.