అపద్దాల ప్రధాని నరేంద్ర మోడీ, నా జీవితంలో చూడలేదు, నోరు విప్పితే అంతే, మాజీ సీఎం ఫైర్!
బెంగళూరు: అచ్చేదిన్ ఎక్కడ ?, యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? శ్రీమంతులు దాచి పెట్టిన బ్లాక్ మనీ ఎక్కడ అంటూ ప్రధాని నరేంద్ర మోడీని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ నోరు విప్పితే అన్ని అపద్దాలు మాట్లాడుతారని, ఇలా అపద్దాలు మాట్లాడే ప్రధాన మంత్రిని తన జీవితంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని, మొదటి సారి నరేంద్ర మోడీని చూస్తున్నానని సిద్దరామయ్య విమర్శించారు.
మాన్ కీ బాత్ అపద్దాలు మూటకట్టిన ఒక సంచి అంటూ సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాన్ కీ బాత్ కార్యక్రమం పూర్తి అయిన తరువాత సిద్దరామయ్య సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు.
అచ్చే దిన్ ఎక్కడా లేదు !
దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ ఐదు సంవత్సరాల పాలన చూశారని, ఎక్కడా వారికి అచ్చే దిన్ కనపడలేదని సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను ఐదు సంవత్సరాల్లో ఎక్కడా అమలు చెయ్యలేదని సిద్దరామయ్య ఆరోపించారు.
నేను చేశాను, మీరు చేశారా ?
కర్ణాటక ముఖ్యమంత్రిగా తాను ఉన్న సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని, ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారని సిద్దరామయ్య ప్రధాని మోడీని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.
చరిత్రలో నిలిచిపోతారు !
దేశ చరిత్రలో ఇలాంటి అపద్దాలు చెప్పిన ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారని సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. ప్రజలను దారి తప్పించి వారికి మాయమాటలు చెప్పడం బీజేపీ రక్తంలోనే ఉందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎద్దేవచేశారు.
55 రోజుల్లో చేశారా ?
కాంగ్రెస్ ప్రభుత్వం 55 ఏళ్లలో చేసిన అభివృద్ది పనులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 55 రోజుల్లో చేసిందని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎద్దేవ చేశారు. బీజేపీకి రాజ్యాంగం మీద నమ్మకం లేదని, పేదలు, మధ్యతరగతి ప్రజల కష్టాలు కనిపించలేదని, 5 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించారని సిద్దరామయ్య అన్నారు.
దళితులు, మైనారిటీల జీవితాలు !
బీజేపీ మతత్వ పార్టీ అని, దళితులు, మైనారీటీలను సుఖంగా బతకడానికి ఆ పార్టీ అవకాశం ఇవ్వదని, ప్రజలను రెచ్చగొడుతుందని, ప్రజాప్రభుత్వం మీద ఆ పార్టీ నాయకులకు నమ్మకం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోషల్ మీడియాలో ఆరోపించారు. పనిలో పనిగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.