సత్తా చాటుకున్న మాజీ సీఎం సిద్దరామయ్య, మాజీ ప్రధానికి చెక్, మైసూరు నో, సిట్టింగ్ సీటుకు ఓకే !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య మరోసారి నిరూపించుకున్నారు. తన అనుచరుడు, సొంత జిల్లాలో తన మాటే నెగ్గాలని భావించిన సిద్దరామయ్య చివరికి ఆ మాటను నిలబెట్టుకున్నారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్.డీ. దేవేగౌడ మొండిపట్టుకు చివరికి సిద్దరామయ్య చెక్ పెట్టారు. ఎలాంటి పరిస్థితిలో మైసూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు ఇచ్చే పరిస్థితి లేదని సిద్దరామయ్య తేల్చి చెప్పడంతో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ వెనక్కి తగ్గారు.
నేను ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ఒక్క షరతు, లేదంటే లేదు: మాజీ ప్రధాని కాంగ్రెస్ కు షాక్ !
మాజీ ప్రధాని పోటీ
హాసన్ లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ పోటీ చెయ్యరని పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి, బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ సదానందగౌడతో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ పోటీ పడతారని ప్రచారం జరిగింది. బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం కాకపోతే మైసూరు నుంచి మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగేడ పోటీ చేస్తారని జేడీఎస్ వర్గాలు అన్నాయి. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆందోళన చెందారు.
మైసూరులో జేడీఎస్ హవా
మైసూరు జిల్లాలో మంత్రులు జీటీ. దేవేగౌడ, సా.రా. మహేష్ తో పాటు పవులురు నాయకుల దెబ్బతో జేడీఎస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ మంత్రి పుట్టరంగరాజు మైసూరులో ఎలాంటి ప్రభావం చూపించలేకపోతున్నారు. తన సొంత జిల్లాలో జేడీఎస్ హవా కొనసాగడం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో మైసూరు- కొడుగు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని ఇటీవల మాజీ ప్రధాని దేవేగౌడ సిద్దం కావడంతో సిద్దరామయ్య షాక్ కు గురైనారు.
సిద్దూ పంతం నెగ్గింది
మైసూరు లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయశంకర్ సైతం ఆందోళనకు గురై సిద్దరామయ్యను ప్రసన్నం చేసుకున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చెయ్యడానికి విజయశంకర్ చివరి క్షణం వరకు పోరాటం చేశారు. అయితే బీజేపీ హైకమాండ్ ప్రతాప్ సింహాకు టిక్కెట్ ఇవ్వడంతో విజయశంకర్ బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి విజయశంకర్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మైసూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు జారిపోకుండా సిద్దరామయ్య పక్కా ప్లాన్ వేసుకుని తన పంతం నెగ్గించుకున్నారు.
సదానందగౌడతో ఢీ
గత శాసన సభ ఎన్నికల్లో మైసూరు జిల్లా వరుణా నియోజక వర్గంలో సిద్దరామయ్య కుమారుడు యతీంద్రను ఓడించడానికి కేంద్ర మంత్రి సదానందగౌడ తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. అప్పటి నుంచి సదానందగౌడ మీద మాజీ సీఎం సిద్దరామయ్య గుర్రుగా ఉన్నారు. సదానందగౌడను ఓడించడానికి సిద్దరామయ్యతో సహ జేడీఎస్ నాయకులు మాజీ ప్రధాని దేవేగౌడను బరిలో దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. సదానందగౌడను ఓడించాలంటే ఒక్క దేవేగౌడకే సాధ్యం అంటున్నారు. అయితే చివరి నిమిషయంలో బీజేపీ నాయకులు బెంగళూరు ఉత్తర లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణను బరిలో దించినా ఎలాంటి ఆశ్చర్చం లేదు.
ఉప ముఖ్యమంత్రి
తుమకూరు లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు వదిలిపెట్టడంతో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ షాక్ కు గురైనారు. తుమకూరు సిట్గింగ్ ఎంపీ (కాంగ్రెస్) ఎస్.పీ. ముద్దహనుమేగౌడను కాదని జేడీఎస్ కు ఆ సీటు కేటాయించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సిట్టింగ్ ఎంపీని కాదని మిత్రపక్షం జేడీఎస్ కు ఎందుకు సీటు కేటాయించారు అంటూ కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.
మైసూరు కోసం త్యాగం
మైసూరు లోక్ సభ స్థానం కాపాడుకోవడం కోసం తుమకూరు లోక్ సభస్థానం జేడీఎస్ కు త్యాగం చేశారు. ఈ విషయంలో తన అనుచరులకు అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ విచారం వ్యక్తం చేస్తున్నారు తుమకూరు జేడీఎస్ అభ్యర్ధి ఎవరు ? అనే చర్చ జోరుగా జరుగుతోంది. తుమకూరు జేడీఎస్ అభ్యర్థికి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు టీవీ. జయచంద్ర, కేఎన్, రాజణ్ణ తదితరులు సహకరిస్తారా అనే అనుమానం మొదలైయ్యింది. తమకూరులో జేడీఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అయితే జిల్లాలతో తమ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద సిద్దరామయ్య తన పంతం నెగ్గించుకోవడం కోసం తుమకూరు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ నెత్తిమీద బండరాయి వేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.