విమర్శలు చేస్తే లీడర్స్ అయిపోతారా ? దేవుడు మంచి బుద్ది ఇవ్వాలి, ఆ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారు !
బెంగళూరు: తనను టార్గెట్ చేసుకుని చౌకబారు విమర్శలు చేస్తున్న జేడీఎస్ నాయకుల మీద ఆ పార్టీ పెద్దలు చర్చలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ఈ రోజు కొందరు జేడీఎస్ పెద్దలు తన మీద విమర్శలు చేసినంత మాత్రాన వారు పెద్దవారు అయిపోరని సిద్దరామయ్య మండిపడ్డారు. సిద్దరామయ్య జనప్రియ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీకి కేవలం 75 ఎమ్మెల్యే సీట్లు ఎలా వచ్చాయి అంటూ జేడీఎస్ కర్ణాటక శాఖ అధ్యక్షుడు హెచ్. విశ్వనాథ్ విమర్శించిన వ్యాఖ్యలపై సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.
నేను ఎప్పుడూ జనప్రియ ముఖ్యమంత్రి అని ఎప్పుడు, ఎక్కడా చెప్పుకోలేదని సిద్దరామయ్య వివరించారు. గతంలో మంత్రి జీటీ. దేవేగౌడ తన మీద లేనిపోని విమర్శలు చేశారు. ఇప్పుడు విశ్వనాథ్ తయారైనారు, ఇక ముందు ఏ నాయకులు ఇలా మాట్లాడుతారో అంటూ సిద్దరామయ్య అసహనం వ్యక్తం చేశారు.
హెచ్. విశ్వనాథ్ తనను ఉద్దేశించి కడుపు మండే మాటలు మాట్లాడుతున్నారని సిద్దరామయ్య అసనం వ్యక్తం చేశారు. గతంలో మంత్రి జీటీ. దేవేగౌడ, నేడు హెచ్. విశ్వనాథ్, ఇక ముందు తనను ఎవరు విమర్శిస్తారో అంటూ సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.
తనను విమర్శిస్తున్న నాయకుల మీద జేడీఎస్ పెద్దలు చర్యలు తీసుకోవాలని సిద్దరామయ్య అన్నారు. తనను విమర్శిస్తున్న వారి మీద సమన్వయ సమితి సమావేశంలో చర్చిస్తామని సిద్దరామయ్య చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వం సవ్యంగా ముందుకు సాగాలని మైత్రిధర్మం తన నోరును కట్టేసిందని, అందుకే తాను ఏమీ మాట్లాడటం లేదని సిద్దరామయ్య అన్నారు.
తనను లేనిపోని మాటలతో విమర్శిస్తున్న విశ్వనాథ్ కు దేవుడు మంచి బుద్ది ఇవ్వాలని కోరుకుంటున్నానని సిద్దరామయ్య అన్నారు. జేడీఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకామండ్ కు ఫిర్యాదు చేస్తామని కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.