ప్రధాని మోడీది సవతి తల్లి ప్రేమ, అన్యాయం, రక్షణ మంత్రిపై సిద్దూ ఫైర్, తేడా ఎందుకు ?
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ప్రజల మీద, రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా శనివారం మాజీ సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీద విమర్శలు గుప్పించారు.
కొడుగు వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని సిద్దరామయ్య ఆరోపించారు. కొడుగు, ఉత్తర కన్నడ జిల్లా వరద బాధితులను ఆదుకోవడానికి నిధులు మంజూరు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం వ్యత్యాసం చూపిస్తోందని సిద్దరామయ్య విమర్శించారు.
కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని సిద్దరామయ్య గుర్తు చేశారు. అయితే కొడుగు పరిస్థితి చూసిన తరువాత ఆ ప్రాంత ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కనీసం కనికరం చూపించడం లేదని, కావాలనే రాజకీయం చేస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీరుపై మాజీ సీఎం సిద్దరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడుగు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి సా.రా. మహేష్ పట్ల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దురుసుగా వ్యవహరించారని సిద్దరామయ్య ఆరోపించారు. ఒక మంత్రిగా ఉంటూ మరో మంత్రిని ఎలా గౌరవించాలో నిర్మలా సీతారామన్ కు తెలీదా ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు.