గత చరిత్ర మరిచిపోవద్దు మిస్టర్ మోడీ: దేశాన్ని ఉద్దరిస్తున్నారా ? యుద్ధం చేశారా ? సిద్దూ ఫైర్ !
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే దేశాన్ని రక్షిస్తారని, ఉద్దరిస్తారని, వేరే వారివలన అది సాద్యం కాదని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రచారంతో ప్రజలను మోసం చెయ్యలేరని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రదాని నరేంద్ర మోడీ గత చరిత్ర మరిపోయి మాట్లాడుతున్నారని, ఆయన ఏమైన స్వాతంత్ర పోరాటం చేసి ప్రధాని అయ్యారా ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు.
సైనికుల శవాలతో రాజకీయం
బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న సిద్దరామయ్య బీజేపీ మీద మండిపడ్డారు. పూల్వామాలో 42 మంది సైనికులు వీరమరణం పొందారని, వారి మీద తమకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. అయితే బీజేపీ నాయకులు దానిని రాజకీయం చేస్తున్నారని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.
నాలుగు సార్లు యుద్ధం
సర్జికల్ స్ట్రైక్ ను రాజకీయం చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని సిద్దరామయ్య ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 12 సార్లు సర్జికల్ స్ట్రైక్ జరిగిందని, నాలుగు సార్లు యుద్దం జరిగిందని, అన్నిసార్లు మనమే విజయం సాధించామని సిద్దరామయ్య అన్నారు.
చరిత్ర మరిచిపోవద్దు మిస్టర్
ఇందిరా గాంధీ అధికారంలో ఉన్న సమయంలో యుద్దం జరిగిందని సిద్దరామయ్య అన్నారు. ఆ సమయంలో ఏర్పాటు అయిన బాంగ్లాదేశ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారా ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు. మీరు గతం మరిచిపోవద్దు మిస్టర్ మోడీ అని సిద్దరామయ్య చెప్పారు.
మోడీ ముఖం చూడండి
మా ముఖం చూసి ఓటు వెయ్యకండి, ప్రధాని నరేంద్ర మోడీ ముఖం చూసి ఓటు వెయ్యండి అని బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు. ప్రజలు బీజేపీ నాయకుల ముఖం చూడకుండా ఎక్కడో ఉన్న మోడీ ముఖం చూసి ఓటు వేస్తే ఈ నాయకులు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని సిద్దరామయ్య ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేసే యోగత్యలేని ఈ బీజేపీ నాయకులు మా ముఖం చూసి ఓటు వెయ్యకండి, మోడీ ముఖం చూడండి అంటూ ప్రచారం చేస్తున్నారని సిద్దరామయ్య ఎద్దేవ చేశారు.
స్వాతంత్ర పోరాటం చేశారా ?
ప్రత్యర్థులను విమర్శించాలి, అయితే ఆ విమర్శలకు అర్థం ఉండాలి అని సిద్దరామయ్య అన్నారు. మోడీ గారు మీరు స్వాతంత్ర వచ్చిన తరువాత పుట్టారు అనే విషయం గుర్తు చేసుకోవాలని సిద్దరాయ్య చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏమైనా స్వాతంత్ర పోరాటం చేశారా, నేడు దేశాన్ని ఉద్దరించడానికి అని సిద్దరామయ్య ప్రశ్నించారు. దేశంలో ఉన్న ఏ బీజేపీ నాయకుడు స్వాతంత్ర పోరాటం చెయ్యలేదని సిద్దరామయ్య అన్నారు. స్వాతంత్ర పోరాటం చేసిన అనేక మంది సర్వం పోగొట్టుకున్నారని, వారిని ఆదుకోవడంలో బీజేపీ నాయకులు విఫలం అయ్యారని సిద్దరామయ్య విమర్శించారు.