నాకు జైలు శిక్ష, అందుకే దేవుడు నీ కొడుకుకు చావు శిక్ష వేశాడు బళ్లారి రెడ్డి, పాపాలు!
బెంగళూరు: బళ్లారి లోక్ సభ ఉప ఎన్నికల సందర్బంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆ రాష్ట్ర మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మద్య వాగ్వివాదం తారాస్థాయికి చేరింది. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్న నాయకులు ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేసుకుంటున్నారు.
తనను నాలుగు సంవత్సరాలు అన్యాయంగా జైలుకు పంపించిన సిద్దరామయ్యకు దేవుడు ఆయన పెద్ద కుమారుడు రాకేష్ కు చావు శిక్ష వేసి బుద్ది చెప్పాడని గాలి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను అనుభవించిన క్షోభకు కారణం అయిన సిద్దరామయ్యకు దేవుడు సరైన బుధ్ది చెప్పారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
ఈ విషయంపై మాజీ సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో గాలి జనార్దన్ రెడ్డికి సరైన సమాధానం ఇచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి చేసిన పాపాలకు ఆయన పిల్లలను శిక్షించకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
ఓ ప్రైవేట్ టీవీ చానల్ తో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి తానను అన్యాయంగా అక్రమ కేసుల్లో ఇరికించిన సిద్దరామయ్య నాలుగు సంవత్సరాలు జైలుకు పంపించారని, ఆ సందర్బంలో తన పిల్లలు తీరని క్షోభకు గురైనారని, అందుకే ఆయన పెద్ద కుమారుడు రాకేష్ ను ఆయనకు దూరం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనను అన్యాయంగా జైలుకు పంపించిన అందరూ కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. సిద్దరామయ్య, గాలి జనార్దన్ రెడ్డి వివాదంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ విమర్శలు చేసుకుంటున్న నాయకులు మధ్యలోవారి కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతున్నారు అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.