నిద్రపోతే ఓటు వేస్తారా, బళ్లారి శ్రీరాములు ఎవరు ? అమిత్ షా ఆటలు సాగవు: మాజీ సీఎం సిద్దూ!
బెంగళూరు: నిద్రపోయే వారికి ఓటు వేసి మీ అమూల్యమైన జీవితాన్ని వృదా చేసుకోరాదని, పని చేసే వారికి మాత్రమే ఓటు వెయ్యాలని గురువారం తాను చేసిన ఈ వ్యాఖ్యల్తో తప్పేముందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య అంటున్నారు. బళ్లారి శ్రీరాములు ఎవరు అని ప్రశ్నించిన మాజీ సీఎం సిద్దరామయ్య ఓటు విషయంలో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ప్రజలను కించపరిచి తాను ఏ రోజు మాట్లాడలేదని చెప్పారు.
సీఎం వ్యాఖ్యలతో లింక్ ?
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలకు, తన వ్యాఖ్యలకు మీరు లింక్ ఎలా పెడుతారని మీడియా మీద సిద్దరామయ్య మండిపడ్డారు. ఓటు మాత్రం మోడీ (బీజేపీ)కి వేస్తారు, మీ సమస్యలు పరిష్కరించాలని మా దగ్గరకు వచ్చి నిలదీస్తారా అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ఇటీవల ప్రజలమీద మండిపడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మాజీ సీఎం సిద్దరామయ్య పై విదంగా స్పందించారు.
మధ్యంతర ఎన్నికలు
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వలనే తాను వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదని సిద్దరామయ్య చెప్పారు. తాము లోక్ సభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాము అంటూ గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని సిద్దరామయ్య వివరించారు. కర్ణాటకలో శాసన సభకు మధ్యంతర ఎన్నికలు రావని, లేనిపోని వాళ్లు చేస్తున్న పుకార్లను ప్రజలు నమ్మకూడదని సిద్దరామయ్య కాంగ్రెస్ కార్యకర్తలకు మనవి చేశారు.
అధికారంలోకి కాంగ్రెస్
కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జోస్యం చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ఆపరేషన్ కమల అంటూ చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని సిద్దరామయ్య అన్నారు. కర్ణాటకలో చక్రం తిప్పాలని ప్రయత్నించిన అమిత్ షా చివరికి చితకలపడ్డారని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు.
శ్రీరాములు ఎవరు ?
కాంగ్రెస్ పార్టీలో తన ప్రభాతం తగ్గుతుందని బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. తన గురించి అలా మాట్లాడటానికి బళ్లారి శ్రీరాములు ఎవరు ? అని సిద్దరామయ్య ప్రశ్నించారు. ప్రజలు తన రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తారని సిద్దరామయ్య చెప్పారు. తన రాజకీయ జీవితం గురించి మాట్లాడటానికి శ్రీరాములు ఎవరు ? అతనికి ఏమి అర్హత ఉంది అంటూ సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.
కక్ష కట్టిన సిద్దరామయ్య
వెనుకబడిన వర్గాలను అనగదొక్కడానికి మాజీ సీఎం సిద్దరామయ్య ప్రయత్నిస్తున్నారని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు ఆరోపించారు. సిద్దరామయ్య చేస్తున్న ప్రయత్నాలను తనతో పాటు బీసీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని శ్రీరాములు హెచ్చరించారు. పాత మైసూరు ప్రాంతంతో పాటు ఉత్తర కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభావం తగ్గిపోతుందని, ఆయన రాజకీయ జీవితం అయోమయంలో పడిపోతున్నదని, ఆయన ఆటలు ఎక్కువ రోజులు సాగవని ఇటీవల విజయపురలో శ్రీరాములు అన్నారు. శ్రీరాములు వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడుతున్నారు.