కాంగ్రెస్ టిక్కెట్లు రూ. కోట్లకు విక్రయం: ఆపార్టీ మాజీ సీఎం ట్వీట్, రాహుల్ కు ట్యాగ్, రచ్చ !
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలోని చిక్కబళ్లాపురం లోక్ సభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ చేసిన ఓ ట్వీట్ ఆ పార్టీలో కలకలంరేపింది. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు రూ. కోట్లకు విక్రయిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ ఢిల్లీలోని అధిష్టానికి ఫిర్యాదు చేస్తూ రాహుల్ గాంధీ ట్వీట్ ట్యాగ్ చెయ్యడంతో ఇప్పుడు ఆట్వీట్ వైరల్ అయ్యి రచ్చరచ్చ అయ్యింది.
రూ. కోట్ల రాజకీయాలు
రాజకీయాల్లో ధన బలం పెరిగిపోయిందని, రూ. కోట్లు ఇస్తున్న కాంట్రాక్టర్లకు శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారని, ఈ విషయంపై అధిష్టానం ఆరా తియ్యాలని వీరప్ప మొయిలీ ఓ ట్వీట్ చేశారు.
మంత్రి గాంధీకి ట్యాగ్
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ సభ్యుడు వీరప్ప మొయిలీ కాంగ్రెస్ పార్టీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ ను ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇండియన్ కాంగ్రెస్ కమిటి, కార్ణాటక కాంగ్రెస్ కమిటీకి ట్యాగ్ చెయ్యడంతో ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపింది.
మంత్రి జోక్యం
కర్ణాటక మంత్రి హెచ్ సి. మహదేవప్ప, కొందరు కాంట్రాక్టర్ల మధ్య శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్లు ఇప్పిస్తామని ఒప్పందం జరుగుతోందని, ఈ విషయంపై ఆరా తియ్యాలని వీరప్ప మొయిలీ అధిష్టానానికి మనవి చేస్తూ ట్వీట్ చేశారు.
కొడుకు కోసం సీటు త్యాగం
టి. నరసీపుర శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే, మంత్రి అయిన హెచ్ సి. మహదేవప్ప త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో తన నియోజక వర్గం కుమారుడు సులీన్ బోస్ కు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించారు. టి. నరసీపుర నుంచి కుమారుడు సునీల్ బోస్ ను పోటీ చేయించి మరొక నియోజక వర్గం నుంచి తాను పోటీ చెయ్యాలని మంత్రి హెచ్ సి. మహదేవప్ప నిర్ణయించారు.
మాజీ సీఎం కొడుకు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ సభ్యుడు వీరప్ప మొయిలీ కుమారుడు హర్షా మొయిలీ సైతం శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అయితే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీరప్ప మొయిలీ కుమారుడు హర్షా మొయిలీకి టిక్కెట్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తుందని ఆరోపణలు వస్తున్న సమయంలో వీరప్ప మొయిలీ బాంబు పేల్చుతూ ట్వీట్ చేశారు.
తండ్రి ట్వీట్ ను కొడుకు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ చేసిన ట్వీట్ ను ఆయన కుమారుడు హర్షా మొయిలీ సైతం రీట్వీట్ చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీలో మరింత కలకలంరేపింది. ఇప్పుడు వీరప్ప మొయిలీ చేసిన ట్వీట్ కు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఎలా సమాధానం చెప్పాలి అంటూ తలలు పట్టుకున్నాయి.
నాకు ఏమీ తెలీదు
కర్ణాటకలో శాసన సభ ఎన్నికల టిక్కెట్లు కాంగ్రెస్ పార్టీ అమ్ముకుంటుందని తాను ఎలాంటి ట్వీట్ చెయ్యలేదని మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ మీడియాకు చెప్పారు. తన కుమారుడు హర్షా మొయిలీ సైతం అలాంటి ట్వీట్ చెయ్యలేదని, వెంటనే ఆ ట్వీట్ ను తొలగిస్తానని వీరప్ప మొయిలీ మీడియాకు చెప్పారు. ఆ ట్వీట్ ఎవ్వరు చేశారు అనే విషయం తనకు తెలీదని వీరప్ప మొయిలీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు షాక్ కు గురైనారు.