సీఎం ధైర్యం ఏమిటో ? ఎమ్మెల్యేల మద్దతు లేదు, రాజీనామా చేస్తే మంచిది: మాజీ సీఎం ఫైర్ !
బెంగళూరు: ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి విఫలం అయ్యారని, ఏ ధైర్యంతో అవిశ్వాస తీర్మాణం ప్రవేశ పెట్టడానికి ఆయన సిద్దం అయ్యారో మాకు అర్థం కావడం లేదని మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అన్నారు. సీఎం రాజీనామా చేస్తే ఆయనకే మంచిదని మాజీ సీఎం యడ్యూరప్ప చెప్పారు.
మాజీ సీఎం యడ్యూరప్ప శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. 18 మంది ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రాజీనామాలు చేశారని యడ్యూరప్ప గుర్తు చేశారు, 15 మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారని బీఎస్. యడ్యూరప్ప చెప్పారు.
Recommended Video
మరో వైపు తాము ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని, తమకు ప్రతిపక్షం కుర్చునే చోట సీట్లు కేటాయించాలని స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ రమేష్ కుమార్ కు మనవి చేశారని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకోవడంలొ విఫలం అయిన సీఎం కుమారస్వామి ఆ పదవిలో ఎలా కొనసాగుతున్నారో చెప్పాలని మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసిన ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె. సుధాకర్ లకు నచ్చచెప్పడానికి ఉదయం నుంచి మంత్రి డీకే. శివకుమార్ విఫలయత్నం చేస్తున్నారని, అయితే వారిద్దరూ రాజీనామాలు వెనక్కి తీసుకునే పరిస్థితిలో లేరని తాను అనుకుంటున్నానని మాజీ సీఎం యడ్యూరప్ప అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే వరకూ తాము వేచి చూస్తామని, తరువాత ఏం చెయ్యాలో ఆలోచిస్తామని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు.