కర్ణాటకలో మధ్యంతర శాసన సభ ఎన్నికలు ? మాజీ ప్రధానికి బీజేపీ పంచ్: చేతకాకపోతే తప్పుకోండి !
బెంగళూరు: కర్ణాటకలో మంధ్యతర ఎన్నికల విషయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ చేసిన వ్యాక్యలపై మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప తనదైన శైలిలో పంచ్ ఇచ్చారు. మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ వ్యాఖ్యలతో సంకీర్ణ ప్రభుత్వంలోని లుకలుకలు బయటపడ్డాయని మాజీ సీఎం యడ్యూరప్ప వ్యంగంగా అన్నారు.
అధికారం ఆనివార్యం ?
శుక్రవారం ఉదయం ప్రైవేటు టీవీ చానెల్ తో మాట్లాడిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఎవరు కారణం ? ఎవరికి అధికారం ఆనివార్యం అయ్యింది ? ఎవరి వలన ఈ రోజు ఈ పరిస్థితి ఎదురైయ్యింది ? అని వివరించారు.
మధ్యంతర ఎన్నికలు
ఇలాంటి సమయంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ? అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ శాసన సభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. అయితే మాజీ ప్రధాని దేవేగౌడ వ్యాఖ్యలతో ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి కుమారస్వామి షాక్ కు గురైనారు.
శాసన సభ ఎన్నికలు కాదు !
మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పింది స్థానిక సంస్థల ఎన్నికల గురించి అని, శాసన సభ ఎన్నికల గురించి కాదని సీఎం కుమారస్వామి వివరణ ఇచ్చారు. మాజీ ప్రధాని దేవేగౌడ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు స్పంధించారు. అపవిత్ర సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని బీజేపీ నాయకులు అంటున్నారు.
మేము రెఢీ
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల స్థానం ఏమిటో ప్రజలు నిర్ణయించారని, రేపు మధ్యంతర ఎన్నికలు జరిగితే వాటిని ఎదుర్కోవడానికి బీజేపీ సిద్దంగా ఉందని మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. కాంగ్రెస్ లో 20 మంది శాసన సభ్యులు అసమ్మతితో రగిలిపోతున్నారని యడ్యూరప్ప బాంబు పేల్చారు.
ప్రభుత్వానికి షాక్
అసమ్మతి ఎమ్మెల్యేలతో తాము టచ్ లో లేమని, అయితే వారు ఎప్పుడైనా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందని, ఆ సమయంలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని యడ్యూరప్ప అన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ చేసిన మధ్యంతర ఎన్నికల ప్రతిపాధనను ప్రజలు అంగీకరించరని యడ్యూరప్ప అన్నారు.
బీజేపీకి అవకాశం ?
ఎక్కువ మంది శాసన సభ్యులు ఉన్న బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని యడ్యూరప్ప అన్నారు. ప్రభుత్వాన్ని నడపడం సంకీర్ణ ప్రభుత్వానికి చేతకాకుంటే తప్పుకోవాలని, ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని మాజీ సీఎం యడ్యూరప్ప చెప్పారు.