మాజీ ప్రధాని ఆకాశం నుంచి దిగి వచ్చారా ?, కాంగ్రెస్ లీడర్ సూటి ప్రశ్న, అతి చేస్తున్నారు!
బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలై రెండు వారాలు అయినా కర్ణాటకలోని తుమకూరు లోక్ సభ నియోజక వర్గంలో ఓటమిపాలైన మాజీ ప్రధాని, జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్.డి. దేవేగౌడ గురించి ఎందుకు అంత చర్చ జరుగుతోంది అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేఎస్. రాజన్న ప్రశ్నించారు.
బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే రాజన్న మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఓటమి గురించి ఇంతగా చర్చించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఎంతో మంది ప్రములు ఓడిపోయారని, వారి గురించి ఎక్కడా ఇంత చర్చ జరగడం లేదని రాజన్న గుర్తు చేశారు.
కోలారులో కేహెచ్. మునియప్ప, కులబురిగిలో మల్లికార్జున్ ఖార్గే, చిక్కబళ్లాపురలో వీరప్పమొయిలీ లాంటి నాయకులు ఓటమిపాలైనారని, వారు జాతీయ స్థాయి నాయకులు కాదా ? వారి గురించి ఎందుకు ఇంత చర్చ జరగడం లేదని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ప్రశ్నించారు.
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఏమైనా ఆకాశం నుంచి దిగి వచ్చారా ఓడిపోకుండా ఉండటానికి అని రాజన్న ప్రశ్నించారు. గతంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఓడిపోయారని, తరువాత వచ్చిన ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారని. అందరిలాగా ఆయన నాయకుడే అని రాజన్న గుర్తు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ గురించి జేడీఎస్ పార్టీతో పాటు నాయకులు తీవ్రస్థాయిలో చర్చించుకుని అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాజన్న ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తుమకూరులో ఓడిపోయిన మాజీ ప్రధాని దేవేగౌడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా ? అనే విషయంలో తాను క్లారిటీ ఇవ్వలేనని మాజీ ఎమ్మెల్యే రాజన్న అన్నారు.