ఐటీ దాడుల దెబ్బ, మాజీ ఉప ముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య, అధికారుల టార్చర్ !
బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనిమర్ నేత డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యాసంస్థల మీద ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేసిన నేపథ్యంలో ఆయన పర్సనల్ సెక్రటరీ (పీఏ) రమేష్ ఆత్మహత్య చేసుకున్నారు. డాక్టర్ జీ. పరమేశ్వర్ పీఏ రమేష్ ఆత్మహత్య సంచలనం రేపింది. బెంగళూరు యూనివర్శిటీ సమీపంలోని జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి గ్రౌండ్స్ సమీపంలోని ఓ చెట్టుకు శనివారం రమేష్ శవమై కనింపించాడు. ఆత్మహత్య చేసుకునే ముందు రమేష్ డెత్ నోట్ రాసి పెట్టాడు.
స్నేహితులకు ఫోన్
రమేష్ అంతకు ముందు స్నేహితులకు ఫోన్ చేసి ఐటీ శాఖ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రమేష్ కోసం ఆయన స్నేహితులు, పోలీసులు గాలిస్తున్న సమయంలో సాయి గ్రౌండ్స్ సమీపంలో రమేష్ చెట్టుకు శవమై కనిపించాడు.
బ్యాంకు అకౌంట్లో భారీగా నగదు ?
డాక్టర్ జీ. పరమేశ్వర్ పీఏ రమేష్ ను ఐటీ శాఖ అధికారులు ప్రశ్నించి వివరాలు సేకరించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి డాక్టర్ జీ. పరమేశ్వర్ దగ్గర రమేష్ పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నాడు. ఐటీ దాడులు జరిగిన రెండు రోజులకే రమేష్ ఆత్మహత్య చేసుకోవడంతో అనేక అనుమానాలకు దారి తీసింది. రమేష్ పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్లలో భారీ మొత్తంలో నగదు ఉందని ఐటీ శాఖ అధికారులు గుర్తించారని తెలిసింది.
కేపీసీసీ ఆఫీస్ లో టైపిస్ట్
బెంగళూరు నగరంలోని క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ (కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి) కార్యాలయంలో రమేష్ టైపిస్టుగా ఉద్యోగం చేసేవాడు. డాక్టర్ జీ. పరమేశ్వర్ కేపీసీసీ అధ్యక్షుడు అయిన సమయంలో ఆయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఉద్యోగంలో చేరాడు. రమేష్ సొంత ఊరు కుణిగల్ సమీపంలోని మెళ్ళహళ్ళి గ్రామం.
రమేష్ విచారణ
మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ఇల్లు, విద్యాసంస్థల మీద దాడులు చేసి సోదాలు చేసిన ఐటీ శాఖ అధికారులు ఈనెల 9వ తేదీ నుంచి ఆయన పీఏ రమేష్ ను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఐటీ శాఖ అధికారులు రమేష్ ను కారులో పిలుచుకుని వెలుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా వీడియోలు తీసింది. శనివారం ఉదయం పరమేశ్వర్ ఇంటిలో రమేష్ ను ఐటీ శాఖ అధికారులు విచారణ చేశారు. పరమేశ్వర్ ఇంటి నుంచి ఉదయం 9 గంటలకు కారులో బయటకు వెళ్లిన రమేష్ తరువాత శవమై కనిపించాడు.
ఆత్మహత్య చేసుకుంటా !
పరమేశ్వర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేష్ తరువాత స్నేహితులకు ఫోన్ చేశాడు. ఐటీ శాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేకపోతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిన రమేష్ తరువాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. రమేష్ స్నేహితులు పోలీసుల సహాయంతో గాలిస్తున్న సమయంలో సాయి గ్రౌండ్స్ సమీపంలో చెట్టుకు శవమై కనిపించాడు.
బెంగళూరులో ఆస్తులు
డాక్టర్ జీ పరమేశ్వర్ పీఏ రమేష్ చెన్నపట్టణలో మూడు అంతస్తుల భవనం నిర్మించాడు. బెంగళూరులో ఇంటితో పాటు నాలుగు ఇంటి స్థలాలు కొనుగోలు చేశాడని వెలుగు చూసింది. గత 8 సంవత్సరాల నుంచి డాక్టర్ జీ. పరమేశ్వర్ కు పర్సనల్ సెక్రటరీగా పని చేస్తున్న రమేష్ కాంగ్రెస్ నాయకుల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. రమేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని తాను షాక్ కు గురైనానని డాక్టర్ జీ. పరమేశ్వర్ మీడియాకు చెప్పారు.