బళ్లారి ముక్కలు, డేట్ ఫిక్స్, సీఎం హామీ, హంపి ఉత్సవాలు పేరు మార్పు?, గాలి బ్రదర్స్ ఫైర్ !
బెంగళూరు/బళ్లారి: యునైటెడ్ బళ్లారి జిల్లాను విభజించి విజయనగర నియోజక వర్గాన్ని మరో జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి ఇప్పటికే డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని, ఆ రోజు దగ్గర్లోనే ఉందని విజయనగర, సీఎం యడియూరప్పకు చాలా థ్యాక్స్ అంటూ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆనంద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బళ్లారి జిల్లాను విభజన చెయ్యరాదని మొదటి నుంచి గాలి బ్రదర్స్, మంత్రి బళ్లారి శ్రీరాములు వ్యతిరేకిస్తున్నారు.
బళ్లారి ముక్కలకు డేట్ ఫిక్స్
2020 జనవరి 11వ తేదీ బళ్లారి జిల్లాను విభజించి విజయనగరను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని ఆనంద్ సింగ్ అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప విజయనగర జిల్లా చేరుకుని ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తారని ఉప ఎన్నికల ప్రచారం సందర్బంగా స్థానిక ప్రజలకు ఆనంద్ సింగ్ హామీ ఇచ్చారు.
ఇక హంపి ఉత్సవాలు కాదు!
హంపి ఉత్సవాలను ఇక ముందు విజయనగర ఉత్సవాలుగా పిలిచే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని, మనకు మంచి రోజులు వస్తాయని ఆనంద్ సింగ్ అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో విజయనగరను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసి తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని ఆనంద్ సింగ్ చెప్పారు.
సీఎంకు థ్యాక్స్
విజయనగర జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటే ముందు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలని ఆ సమయంలో తన మీద ఒత్తిడి ఎక్కువైయ్యిందని మాజీ మంత్రి ఆనంద్ సింగ్ అన్నారు. విజయనగరను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన సీఎం యడియూరప్పకు ఇదే సమయంలో ఆనంద్ సింగ్ ధన్యవాదాలు చెప్పారు.
గాలి బ్రదర్స్ వ్యతిరేకం
బళ్లారి జిల్లాను విభజించడానికి కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు, బళ్లారి సిటీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి, మరో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డితో పాటు అనేక మంది బీజేపీ బళ్లారి జిల్లా నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో బళ్లారిని కచ్చితంగా విభజన చేస్తామని ఆనంద్ సింగ్ పట్టుబట్టడం ఆ జిల్లా ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.