సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు మోడీ ఆదేశం: కర్ణాటకలో అధికారం లేదని కక్ష, డీకే బ్రదర్స్ ఫైర్ !
బెంగళూరు: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ తమ మీద కక్షకట్టి సీబీఐ. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఐటీ శాఖలతో దాడులు చేయించడానికి సిద్దం అయ్యారని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే. శివకుమార్, ఆయన సోదరుడు బెంగళూరు గ్రామీణ లోక్ సభ సభ్యుడు (కాంగ్రెస్) డీకే. సురేష్ ఆరోపించారు. గురువారం ఉదయం సదాశివనగర్ లోని నివాసంలో డీకే బ్రదర్స్ అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
11 మంది టార్గెట్
మా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు మొత్తం 11 మందిని టార్గెట్ చేసుకుని ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో దాడులు చేయించడానికి సర్చ్ వారెంట్లు జారీ చేశారని ఢిల్లీ నుంచి తమకు సమాచారం అందిందని డీకే. శివకుమార్ ఆరోపించారు.
న్యాయపోరాటం
కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలు అయిన సీబీఐ, ఈడీ, ఐటీని దుర్వినియోగం చేసి తమ మీద దాడులు చేయించడానికి సిద్దం అయ్యిందని డీకే. శివకుమార్ ఆరోపించారు. తమకు దేవుడి మీద, కర్ణాటక రాష్ట్ర ప్రజల మీద నమ్మకం ఉందని, కేంద్ర ప్రభుత్వం మీద తాము న్యాయపోరాటం చేస్తామని డీకే. శివకుమార్ మీడియాకు చెప్పారు.
జైల్లో పెట్టినా భయపడం
గతంలో తమ మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని, ఆ సమయంలో ఎలాంటి నగదు చిక్కలేదని, అయినా భారీ మొత్తంలో నగదు చిక్కిందని కేసులు నమోదు చేసి వేధించారని, అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టినా తాము ఇలాంటి బెదిరింపులకు లొంగమని డీకే. శివకుమార్ స్పష్టం చేశారు.
మా ఫ్యామిలీ టార్గెట్
బీజేపీకి వ్యతిరేకంగా తాము మాట్లాడినందుకు మా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని ఐటీ, ఈడీ, సీబీఐతో దాడులు చేయించడానికి మోడీ ప్రభుత్వం సిద్దం అయ్యిందని డీకే. శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ డీకే. సురేష్ ఆరోపించారు. 11 చోట్ల సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ దాడులు చెయ్యడానికి సిద్దం కేంద్ర ప్రభుత్వం సిద్దం అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ ఆరోపించారు.
అధికారం అడ్డుకున్నాం
కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాకుండా తాము కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకున్నామని కేంద్ర ప్రభుత్వం తమ మీద కక్ష కట్టిందని డీకే. సురేష్ ఆరోపించారు. నాలుగు రోజుల్లో మా ఫ్యామిలీకి చెందిన 11 మంది మీద దాడులు జరిగే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని, అయితే ఆ 11 మంది ఎవరు అనే విషయం ఇంకా కచ్చితంగా తెలియడం లేదని డీకే. సురేష్ అన్నారు. చట్టపరంగా తాము వ్యాపారాలు చేస్తున్నామని, ఎలాంటి దాడులకు తాము భయపడమని డీకే. సురేష్ బీజేపీ నాయకులను హెచ్చరించారు.