ఆదాని కంపెనీకి నీకు ఏం సంబంధం ఐశ్వర్య, డీకే కూతురుకు ఈడీ ప్రశ్నలు, ఉషా ఆస్తి!
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టు అయిన కర్ణాటక మాజీ మంత్రి డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణ చేస్తున్నారు. ఆదాని కంపెనీకి నీకు ఏమిటి సంబంధం అని ఈడీ అధికారులు ఐశ్వర్యను ప్రశ్నించారని సమాచారం. డీకే శివకుమార్ భార్య ఉషా, వారి కుమార్తె ఐశ్వర్య గురువారం న్యూఢిల్లీలోని ఈడీ అధికారుల ముందు హాజరైనారు.
ఈడీ ముందు హాజరైన ఐశ్వర్య, రూ. 100 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది, కూతురు పేరుతో డీకే !
లోక్ నాయక్ భవన్
ఢిల్లీలోని లోక్ నాయక్ భవన్ లోని ఈడీ అధికారుల ముందు డీకే. శివకుమార్ భార్య ఉషా, కుమార్తె ఐశ్వర్య హాజరైనారు. డీకే. శివకుమార్ కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలు గురించి ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. డీకే. శివకుమార్ భార్య ఉషా, కుమార్తె ఐశ్వర్య పేర్ల మీద ఎంత ఆస్తి ఉంది అని ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
డీకే వ్యాపారాలు ఎన్ని ?
కనకపుర తాలుకా దొడ్డ అలహళ్ళి గ్రామానికి చెందిన కంపేగౌడ, గౌరమ్మ దంపతుల కుమారుడు డీకే. శివకుమార్. డీకే. శివకుమార్ అనేక వ్యాపారాలు, సమాజసేవ, రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. డీకే. శివకుమార్ ఎన్ని చోట్ల వ్యాపారం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ లో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఐశ్వర్య వ్యాపారాలు
డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఐశ్వర్య రియల్ ఎస్టేట్, క్వారీలు, వివిద వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు. వ్యాపారాల్లో ఐశ్వర్య ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. డీకే. శికుమార్ కుమార్తె ఐశ్వర్య ఒక్కసారిగా కోట్ల రూపాయల ఆస్తికి వారసురాలు అయ్యారు.
రూ. 1.2 కోట్ల నుంచి ఐశ్వర్య ఆస్తులు రూ. 112 కోట్లు
బెంగళూరులోని నేషనల్ హిల్ వ్యూ పబ్లిక్ స్కూల్ లో ఐశ్వర్య ట్రస్టి. సోల్ అండ్ సేల్స్ లో ఐశ్వర్య రూ. 78 కోట్లు పెట్టుబడులు పెట్టారు. కంపెనీలో 50 శాతం వాటాలను ఐశ్వర్య కొనుగోలు చేశారు. 2013లో ఐశ్వర్య ఆస్తులు రూ. 1.2 కోట్లు. నేడు ఐశ్వర్య ఆస్తులు రూ. 112 కోట్లు. ఈ విషయంలోనే ఈడీ అధికారులు ఐశ్వర్యను ప్రశ్నిస్తున్నారు.