గాలికి సుడిగాలి కష్టాలు: బళ్లారీలో కేసు నమోదు
బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి బళ్లారీలో అడుగు పెట్టిన వెంటనే ఆయన అనుచరుల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం సాయంత్రం గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలో అడుగు పెట్టారు. ఐదు సంవత్సరాల తరువాత బళ్లారీలో అడుగు పెడుతున్న గాలికి స్వాగతం పలకడానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు.
మంగళవారం సాయంత్రం బళ్లారీ సమీపంలోని పిడిహళ్ళి దగ్గరకు గాలి జనార్దన్ రెడ్డి వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఇంటి వరకు ఐదు కిలో మీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి గాలి అభిమానులు కొన్ని వేల మంది వందల వాహనాల్లో అక్కడికి వచ్చారు.
అక్కడి నుంచి గాలి ఇంటి వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. విషయం గుర్తించిన పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బళ్లారీలోని మూడు మెయిన్ సర్కిల్స్ లో పోలీసులు సిగ్నల్స్ ఆఫ్ చేశారు. తరువాత గాలి అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.
ఆ సమయంలో మద్యం సేవించిన కొందరు మందు బాబులు నానా హంగామా చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ చేశారు. గిడిగి చెన్నప్ప సర్కిల్ నుంచి ఎస్ పీ కార్యాలయం దగ్గర వరకు వాహనం సంచారం బంద్ చేస్తారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ర్యాలీగా వెళ్లడంతో ట్రాఫిక్ జాం అయ్యింది.
మార్గం మధ్యలో అభిమానులతో మాట్లాడిన గాలి జనార్దన్ రెడ్డి నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ సమయంలో బళ్లారీ ఎంపీ బి. శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డిని వారించారు.
తరువాత గాలి తన ప్రసంగాన్ని నిలిపివేసి ఇంటికి బయలుదేరారు. అయితే అప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలో అడుగు పెట్టిన వెంటనే కేసు నమోదు కావడంతో ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాట్లాడటానికి గాలి జనార్దన్ రెడ్డి నిరాకరించారు.