గాలి కథ ఖతమ్ ? డెత్ నోట్ లో ఏముందంటే
డ్రైవర్ రమేష్ గౌడ రాసిన డెత్ నోట్ లో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయని సమాచారం.
బెంగళూరు: మండ్య జిల్లా మద్దూరులోని లాడ్జ్ లో ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ రమేష్ గౌడ రాసిన డెత్ నోట్ లో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయని సమాచారం.
బిగ్ షాక్: గాలి జనార్ధన్ రెడ్డికి చిక్కులు, కూతురు పెళ్లికి రూ.100 కోట్ల మార్పిడి
ఇప్పటికే కేఏఎస్ అధికారి భీమా నాయక్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భీమా నాయక్ రెవెన్యూ శాఖలో భూస్వాధీన ప్రత్యేక అధికారిగా పని చేస్తున్నారు. నవంబర్ 8వ తేదిన రూ. 1,000, రూ.500 నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
నవంబర్ 16వ తేదిన బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో గాలి జనార్దన్ రెడ్డి భారీ ఖర్చుతో తన కుమార్తె వివాహం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గాలి జనార్దన్ రెడ్డి దగ్గర కేఏఎస్ అధికారి భీమా నాయక్ రూ. 100 కోట్లు (రూ. 1,000, రూ.500 నోట్లు) తీసుకుని కమీషన్ పద్దతిలో మార్చి ఇచ్చారని రమేష్ గౌడ తన డెత్ నోట్ రాశాడు.
ఈ పూర్తి తతంగం తెలిసన రమేష్ గౌడను విషయం బయటకు చెప్పరాదని గాలి సోదరులు, కేఏఎస్ అధికారి భీమా నాయక్ బెదిరించారని, వారందరికి భయపడి రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బెంగళూరులోని తాజ్ హోటల్ లో గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారీ ఎంపీ శ్రీరాములు (బీజేపీ) కేఏఎస్ అధికారి భీమా నాయక్ ను కలిశారని, అదే సమయంలో రూ. 1,000, రూ. 500 పాత నోట్లు తీసుకుని వారికి రూ. 2,000, రూ.100, రూ.50 నోట్లు ఇచ్చారని రమేష్ గౌడ డెత్ నోట్ లో రాశాడు.
మొదట రూ. 25 కోట్ల పాత నోట్లను మార్పిడి చేసి కొత్త నోట్లు ఇచ్చారని, తరువాత మిగిలిన రూ. 75 కోట్ల పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చారని రమేష్ గౌడ డెత్ నోట్ లో వివరించాడు. అదే విదంగా తన అంత్యక్రియలు ఎలా చెయ్యాలో కూడా రమేష్ గౌడ డెత్ నోట్ లో వివరించాడు.
రమేష్ గౌడ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన డెత్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే కేఏఎస్ అధికారి భీమా నాయక్, ఆయన కారు డ్రైవర్ మహమ్మద్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.