గాలి జనార్దన్ రెడ్డికి ఎదురు దెబ్బ, అక్రమ మైనింగ్, సీబీఐ విచారణకు గ్నీన్ సిగ్నల్ !
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో ఐపీఎస్ సెక్షన్ 409 కింద మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని విచారణ చెయ్యడానికి సీబీఐకి కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంత కాలం అక్రమ మైనింగ్ కేసులో కొంత ఊపిరిపీల్చుకున్న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి హై కోర్టు ఆదేశాలతో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి బిఎ. పాటిల్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ సెక్షన్ 409 కింద కేసు విచారణ చెయ్యడానికి సీబీఐకి అనుమతి ఇచ్చింది.
రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు !
గాలి జనార్దన్ రెడ్డి కేసు
2013లో అక్రమ మైనింగ్ కేసు విచారణ చేసిన సీబీఐ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీద ఐపీఎస్ 409 సెక్షన్ కింద విచారణ చెయ్యాలని నిర్ణయించింది. అయితే ఈ కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అర్జీ విచారణ చేసిన ప్రత్యేక న్యాయస్థానం 2018 సెప్టెంబర్ 18వ తేదీన గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా స్టే ఇచ్చింది. ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ప్రశ్నిస్తూ సీబీఐ కర్ణాటక హై కోర్టును ఆశ్రయించింది.
సీబీఐ వాదనలు
అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి విచారణ జరిగింది. ఇదే కేసులో సాక్షులను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఇలాంటి సమయంలో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారణ నుంచి మినహాయించడం లేదా కొత్తగా పేర్లు చేర్చడం ప్రత్యేక న్యాయస్థానానికి అధికారాలు లేవని సీబీఐ తరపు న్యాయవాది ఎస్ పీపీ ప్రసన్న కుమార్ హై కోర్టులో వాదనలు వినిపించారు.
ఎఫ్ఐఆర్ లో 409 సెక్షన్
గాలి జనార్దన్ రెడ్డి మీద నమోదైన ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 409 విశ్వాస ద్రోహం కింద కేసు నమోదైయ్యింది. ఈ సెక్షన్ కింద విచారణ చెయ్యడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలకు సెప్టెంబర్ నెలలో హై కోర్టు స్టే ఇచ్చింది. తరువాత సెక్షన్ 409 కింద విచారణ చెయ్యడానికి హై కోర్టు ఏకసభ్య బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నేరం రుజువు అయితే !
ప్రత్యేక న్యాయస్థానంలో ఈ కేసు విచారణ మొదలైయ్యింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలు నిజం కాకపోతే ఆయన ఊపిరిపీల్చుకునే అవకాశం ఉంది. మిగిలిన సెక్షన్ ల కింద నమోదైన కేసు విచారణ అలాగే జరుగుతుంది. ఈ కేసులో ఆరోపణలు నిజం అయితే గాలి జనార్దన్ రెడ్డికి కష్టకాలం ఎదురయ్యే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.
బెళికేరి మైనింగ్ కేసు
2009 జనవరి 1 నుంచి 2010 మే 31 మద్య కాలంలో మెసర్స్ డ్రీమ్ లాజిస్టిక్ కంపెనీ బేళికేరి మైనింగ్ నుంచి 9.16 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజం అక్రమంగా ఎగుమతి చేసిందని నమోదైన కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ మొదలు పెట్టింది. ఈ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తదితరుల మీద 2012 సెప్టెంబర్ 13వ తేదీ కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో 2013లో ఎఫ్ఐఆర్ తయారు చేసి కోర్టు ముందు సమర్పించారు.