కాంగ్రెస్ మంత్రి పదవులు, అసమ్మతి, రాజీనామాకు సిద్దం, టైర్లకు నిప్పు, ఆత్మహత్య, వార్నింగ్!
బెంగళూరు: లింగాయుత వర్గంలో అత్యంత శక్తివంతమై నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి ఎంబి. పాటిల్ కు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది. మాజీ మంత్రి ఎంబి. పాటిల్ అనుచరులు బెంగళూరులో ధర్నా చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని చాళుక్య సర్కిల్ లో ఎంబి. పాటిల్ అనుచరులు టైర్లకు నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో ఎంబి. పాటిల్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. కరువు కాలంలో చెరువుల్లో నీరు నిల్వ ఉండటానికి ఎంబి. పాటిల్ ఎంతో కృషి చేశారని పేరు ఉంది.
లింగాయుతలకు ప్రత్యేక మతం, మైనారిటీ హోదా ఇప్పించడంలో ఎంబి. పాటిల్ శక్తివంచన లేకుండా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మొదటి విడత మంత్రి వర్గం జాబితాలో ఎంబి. పాటిల్ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
ఎంబి. పాటిల్ బెంగళూరు నగరంలోని సదాశివనగర్ లోని ఇంటిలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చించిన తరువాత తన నిర్ణయం ప్రకటిస్తానని ఎంబి. పాటిల్ మీడియాకు చెప్పారు. ఎంబి. పాటిల్ కు మంత్రి పదవి ఇవ్వకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామని ఆయన అనుచరులు హెచ్చరిస్తున్నారు.