నమ్మిన కాంగ్రెస్ ను ముంచేస్తే నమ్ముకున్న బీజేపీ నట్టేట ముంచేసింది, బేగ్ కథ క్లోజ్, సైలెంట్!
బెంగళూరు: కాంగ్రెస్ పురాతన కాలం పార్టీ అంటూ చెప్పుకుంటూ తిరిగిన కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరు నగరంలోని శివాజీనగర నియోజక వర్గం అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ పరిస్థితి దారుణంగా తయారైయ్యింది. ఇంత కాలం నమ్మిన కాంగ్రెస్ ను రోషన్ బేగ్ ముంచేశారు. ఇప్పుడు రోషన్ బేగ్ నమ్ముకున్న బీజేపీ ఆయన్ను నట్టేట ముంచేసింది. రెండు పార్టీల్లో దెబ్బ మీద దెబ్బ పడటంతో రోషన్ బేగ్ జేడీఎస్ వైపు చూశారు. అయితే జేడీఎస్ పార్టీ రోషన్ బేగ్ కు తలుపులు మూసేసింది. ఏ పార్టీ టిక్కెట్ రాకపోవడంతో శివాజీనగర ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యకూడదని రోషన్ బేగ్ నిర్ణయించారు. ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని రోషన్ బేగ్ మీద ఆయన అనుచరులు ఒత్తిడి చేశారు. అయితే ఉప ఎన్నికల్లో తటస్థంగా, సైలెంట్ గా ఉండిపోవాలని రోషన్ బేగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి!
రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం
కర్ణాటకలో కలకలం సృష్టించిన రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యూవెలర్స్ స్కాంలో మాజీ మంత్రి రోషన్ బేగ్ పేరు వినిపించింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐఎంఏ స్కాం కేసు సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఆందోళన చేసింది. తరువాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఐఎంఏ కేసు సీబీఐకి అప్పగించింది. ఐఎంఏ స్కాం కేసును ప్రస్తుతం సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఐఎంఏ స్కాం ప్రధాన నిందితుడు మన్సూర్ ఆలీ ఖాన్ స్వయంగా రోసన్ బేగ్ కు ఈ స్కాంతో సంబంధం ఉందని సీబీఐకి చెప్పాడు. ఈ సమయంలో రోషన్ బేగ్ ను బీజేపీలో చేర్చుకోరాదని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. శివాజీనగర ఉప ఎన్నికల్లో రోషన్ బేగ్ కు బీజేపీ హ్యాండ్ ఇచ్చింది.
మూడు పార్టీల తలుపులు క్లోజ్
కాంగ్రెస్ పార్టీ నాయకులను నోటికి వచ్చిన దూషించిన మాజీ మంత్రి రోషన్ బేగ్ ను ఆ పార్టీ హైకమాండ్ పార్టీ నుంచి బహిష్కరించింది. అనర్హత వేటుకు గురైన రోషన్ బేగ్ కు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అవకాశం లేకుండా పోయింది. రోషన్ బేగ్ నమ్ముకున్న బీజేపీ సైతం శివాజీనగర ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా ఎం. శరవణకు అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తలుపులు మూసివేయడంతో రోషన్ బేగ్ జేడీఎస్ వైపు చూశారు. ఐఎంఏ స్కాం కేసు భయంతో మాజీ ప్రధాని, దళపతి హెచ్.డీ. దేవేగౌడ, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి రోషన్ బేగ్ కు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించారు. మూడు పార్టీలు తలుపులు మూసివేయడంతో రోషన్ బేగ్ అయోమయంలో పడిపోయారు.
2004లో నకిలి స్టాంప్ పేపర్ల స్కాం
2004లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నకిలి స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో అబ్దుల్ కరీం లాల్ తెల్గీతో పాటు రోషన్ బేగ్ చిక్కుకున్నారు. నకిలి స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో అబ్దుల్ కరీం లాల్ తెల్గీ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో ఎస్ఎం. కృష్ణ ప్రభుత్వంలో రోషన్ బేగ్ మంత్రి పదవిలో ఉన్నారు. ప్రతిపక్షాలు ఒత్తిడి చెయ్యడంతో రోషన్ బేగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసులో అరెస్టు అయిన కరీం లాల్ తెల్గీతో రోషన్ బేగ్ కు సంబంధాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన వియం తెలిసిందే.
చేతులు ఎత్తేసిన బీజేపీ
బెంగళూరు నగరంలోని కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి ఎంజే. అక్బర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలను సంప్రధించిన అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ బీజేపీలో చేరడానికి విఫలయత్నం చేశారు. అయితే ఐఎంఏ స్కాం కేసులో రోషన్ బేగ్ పేరు ఉండటంతో ఆయన్ను పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించింది.
అంత రిస్క్ ఎందుకు?
ఉప ఎన్నికల్లో రోషన్ బేగ్ కు శివాజీనగర్ టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ నిరాకరించింది. ఏ పార్టీ టిక్కెట్ రాకపోవడంతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి లేనిపోని సమస్యలు ఎందుకు కొని తెచ్చుకోవాలని ఆలోచించిన రోషన్ బేగ్ ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉండిపోయారు. మొత్తం మీద రోషన్ బేగ్ రాజకీయ జీవితం ఎటువైపు అడుగులు వేస్తోందో అర్థంకాక ఆయన అనుచరులు అయోమయంలో పడిపోయారు.