బెంగళూరులో హైడ్రామా: ఎయిర్ పోర్టులో రెబల్ ఎమ్మెల్యే అరెస్టు, రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం!
బెంగళూరు: రూ. వేల కోట్ల ఐఎంఏ స్కాం కేసు దర్యాప్తు చేస్తున్న బెంగళూరు ప్రత్యేక బృందం అధికారులు (ఎస్ఐటీ) మాజీ మంత్రి, బెంగళూరులోని శివాజీనగర ఎమ్మెల్యే (రెబల్) రోషన్ బేగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. సోమవారం అర్దరాత్రి ముంబై వెళ్లడానికి ప్రయత్నించిన రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను ఎస్ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం అర్దరాత్రి ముంబై వెళ్లడానికి రోషన్ బేగ్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐటీ అధికారులు అర్దరాత్రి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను అదుపులోకి తీసుకున్నారు.
ముంబై వెళ్లడానికి రోషన్ బేగ్ ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకుని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం చేరుకున్నారని ఎస్ఐటీ అధికారులకు సమాచారం అందింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే మాజీ మంత్రి రోషన్ బేగ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు.
కర్ణాటక ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోషన్ బేగ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరుతున్నానని రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ అనేకసార్లు చెప్పారు. సోమవారం బెంగళూరులో రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఎస్ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరుకావలసి ఉంది.
తాను హజ్ యాత్రకు వెళ్లడానికి సిద్దం అవుతున్నానని, ఈ రోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ఆయన పీఏతో ఎస్ఐటీ అధికారులకు సమాచారం పంపించారు. రూ. వేల కోట్ల ఐఎంఏ జ్యువెలర్స్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు, ఆ సంస్థ యజమాని మన్సూర్ ఖాన్ తన దగ్గర మాజీ మంత్రి రోషన్ బేగ్ భారీ మొత్తంలో లంచం తీసుకున్నారని ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు.
విదేశాలలో తలదాచుకున్న మన్సూర్ ఆలీ ఖాన్ వీడియో విడుదల చేసినప్పటి నుంచి రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ మీద ఎస్ఐటీ అధికారులు నిఘా వేశారు. శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ బెంగళూరు వదిలి వెలుతున్నారని సమాచారం రావడంతో అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఆయన్ను ఎస్ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐటీ అధికారులు మాజీ మంత్రి, రెబల్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ ను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.