సుప్రీం కోర్టు తీర్పుపై అంతా సస్పెన్స్: యెడ్డీ లేని బలాన్ని చూపించారా, ఆ లేఖనే కీలకం
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఆసక్తిగా మారాయి. కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను హైదరాబాదులోని హోటల్స్కు తరలించాయి. మరోవైపు, యడ్యూరప్ప ప్రమాణ స్వీకారంపై కాంగ్రెస్ - జేడీఎస్లు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. యడ్డీ ప్రమాణ స్వీకారంపై స్టే ఇవ్వలేదు. కానీ యడ్డీ గవర్నర్కు ఇచ్చిన మద్దతు లేఖ తమకు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
గవర్నర్ ఏకైక అతిపెద్ద పార్టీని ఆహ్వానించి, మెజారిటీ నిరూపించుకోవాలని కోరే సంప్రదాయం ఉన్నదే కదా అని, ప్రభుత్వం ఏర్పడకుండా నియంత్రిస్తూ మేం ఆదేశాలిస్తే రాష్ట్రంలో రాజ్యాంగ శూన్యత ఏర్పడదా అని, గత తీర్పుల సరళి చూస్తే గవర్నర్ను ముందుగానే నియంత్రించరాదని అర్థమవుతోందని, కాబట్టి యడ్యూరప్ప ప్రమాణంపై స్టే విధిస్తూ మేం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని, కానీ ప్రమాణం ఈ పిటిషన్పై తదుపరి ఉత్తర్వులు, తుది తీర్పునకు లోబడాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు గురువారం వెల్లడించింది. అనంతరం శుక్రవారం పదిన్నర గంటలకు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీం కోర్టుపై ఉంది.
యడ్యూరప్ప లేఖ సారాంశమే కీలకం
తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప గవర్నర్కు ఇచ్చిన లేఖను సుప్రీం కోర్టుకు ఇవ్వనున్నారు. లేని బలాన్ని ఆయన చూపించారా లేక నిజంగానే బలం ఉందా అనేది కాసేపట్లో తేలిపోనుంది. దీంతో అందరి దృష్టి సుప్రీం కోర్టు వైపు ఉంది. గవర్నర్కు యడ్యూరప్ప ఇచ్చిన లేఖను అటార్నీ జనరల్ సుప్రీం ముందు ఉంచనుంది.