యెడ్డీ 'మద్దతు' జాబితా: సుప్రీం కీలక వ్యాఖ్యలు, రేపే ఫ్లోర్ టెస్ట్కు కాంగ్రెస్ రెడీ, బీజేపీ మెలిక
న్యూఢిల్లీ/బెంగళూరు: యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం, గవర్నర్ నిర్ణయంపై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అభిషేక్ సింఘ్వీ, బీజేపీ తరఫున ముఖుల్ రోహిత్గీ, కేంద్రం తరఫున ఏజీ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తున్నారు.
Recommended Video
యడ్యూరప్పకు ఉన్న బలంకు సంబంధించిన వివరాలను ముఖుల్ రోహిత్గీ సుప్రీంకు అందించారు. తమకు తగిన సంఖ్యా బలం ఉందని ముఖులు రోహిత్గీ సుప్రీంకు తెలిపారు. రెండు, మూడు స్థానాల్లో ఉన్న పార్టీలు చాలా దూరంలో ఉన్నాయన్నారు.
మీకు తగిన సంఖ్యాబలం ఉంటే రేపే (శనివారం) ఫ్లోర్ టెస్ట్కు ఆహ్వానించవచ్చా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మీకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లను ఎందుకు చెప్పలేకపోతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఇది ఓ నెంబర్ గేమ్ అని, ఎవరికి మెజార్టీ ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది.
జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలం ఉందని, కానీ బీజేపీని ఎలా ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారని కాంగ్రెస్ తరఫు లాయర్ సింఘ్వీ వాదించారు. బీజేపీకి మెజార్టీ లేదని కాంగ్రెస్ వాదించింది.
ఫ్లోర్ టెస్ట్
రేపు ఫ్లోర్ టెస్టుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే బీజేపీ మాత్రం రేపటికి రేపు కష్టమని చెప్పింది. ఫ్లోర్ టెస్టుకు మరింత సమయం కోరింది. ఇప్పటికి ఇప్పుడు అసెంబ్లీ సమావేశం కష్టమని, ఎమ్మెల్యేలు బయట ఉన్నారని చెప్పింది. వారం సమయం కోరింది. అయితే సుప్రీం కోర్టు అందుకు నిరాకరించింది. రేపు సాయంత్రం (శనివారం) నాలుగు గంటలకు ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది.
యెడ్డీకి ఆదేశాలు
ఫ్లోర్ టెస్టు పూర్తయ్యే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని యెడ్డీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియమించిన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్ని నిలిపివేసింది.
గురువారం ఏం జరిగిందంటే..
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా అది ఫైనల్ కాదు. మంత్రివర్గ ఏర్పాటు, పాలన అంతా సుప్రీం కోర్టు తుది తీర్పు తర్వాతే ఉంటుంది. యడ్యూరప్ప గవర్నర్కు 15, 16 తేదీల్లో లేఖలు రాశారు. ఆ రెండు లేఖలు తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.