ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్.. ఐదేళ్లు నో పర్మిషన్!.. నీటి కష్టాలే కారణమా?
బెంగళూరు : నీటి కష్టాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. వృధా చేయడం చాలామంది విస్మరిస్తున్నారు. ఇప్పటి నుంచి బొట్టు బొట్టు ఒడిసిపట్టకుంటే భవిష్యత్తులో నీటి కష్టాలు కన్నీళ్లు తెప్పించకమానవు అనే మేధావుల మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే చెన్నై మహానగరంలో నీటి కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది.
అదే క్రమంలో కర్ణాటకలోనూ నీటి ఎద్దడి తీవ్రతరమవుతోంది. నీటి సంక్షోభం తీవ్రమవుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా ఇళ్ల నిర్మాణాలకు బ్రేక్ ఇవ్వాలనే ఆ డెసిషన్.. పలు రాష్ట్రాలకు ఆదర్శం కానుందనే టాక్ వినిపిస్తోంది.
గుడి కోసం గ్రామస్తులు వాటర్ ట్యాంక్ ఎక్కారు.. అధికారులు దిగొచ్చారు
బెంగళూరులో నీటి కష్టాలు.. అందుకే ఆ నిర్ణయం
బెంగళూరులో నీటి కష్టాలకు కొదువే లేదు. రోజురోజుకీ వాటర్ సంక్షోభం జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. నీటి ఎద్దడి కారణంగా బెంగళూరు వాసులు నానాకష్టాలు పడుతున్నారు. ఆ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేలా కసరత్తు చేస్తోంది. ఐదేళ్ల వరకు బెంగళూరులో అపార్టుమెంట్ల నిర్మాణాలపై నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది. డిప్యూటీ సీఎం పరమేశ్వర గురువారం ఈ విషయం వెల్లడించడంతో చర్చానీయాంశమైంది.
లెక్కకు మించి అపార్టుమెంట్లు.. కానరాని సౌకర్యాలు
బెంగళూరులో లెక్కకు మించి అపార్టుమెంట్లు కనిపిస్తాయి. ఎటుచూసినా బహుళ అంతస్థుల భవనాలే దర్శనమిస్తాయి. అపార్టుమెంట్ కల్చర్ బాగా ప్రాచుర్యం పొందడంతో బిల్డర్లకు కాసులపంట కురిపిస్తోంది. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం వారు విఫలమవుతున్నారు. కనీసం తాగునీటి ఫెసిలిటీ లేకుండానే ఫ్లాట్లు అమ్మేస్తున్నారు. దాంతో నీటి కోసం అపార్టుమెంట్ వాసులు ట్యాంకర్ల మీద ఆధారపడాల్సిన పరిస్థితి.
అయితే ట్యాంకర్లలో వచ్చే నీరు నాణ్యత లేకపోవడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ విషయాలను ప్రస్తావించిన డిప్యూటీ సీఎం పరమేశ్వర.. ఐదేళ్ల పాటు నగరంలో కొత్త అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతులివ్వకుంగా నిషేధం విధించాలనే ప్రతిపాదననను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అందుకే ఐదేళ్లు నిషేధం.. త్వరలో నిర్ణయం
త్వరలో బిల్డర్లతో ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నట్లు చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పుకొచ్చారు. కావేరి ఐదో దశ ప్రాజెక్టు నిర్మాణం స్పీడప్ అయినప్పటికీ.. బెంగళూరు నీటి కష్టాలు తీర్చడానికి సరిపోదన్నారు. ఆ క్రమంలో ప్రత్యామ్నాయంగా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న శివమొగ్గ జిల్లాలోని లింగనమక్కి డ్యామ్ నుంచి నీటిని తెప్పించేలా అధికారులకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. దానికోసం డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు.
ఐదేళ్లలో జలవనరులు పెంచేలా..!
బెంగళూరులో నీటి కష్టాలు దృష్టిలో పెట్టుకుని అపార్టుమెంట్ల నిర్మాణాలకు బ్రేక్ చెప్పాలని యోచిస్తున్నామని.. ఐదేళ్ల వరకు నిషేధం విధించి, అంతలోపు జలవనరులు సమకూర్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న ఐదేళ్లలో వివిధ మార్గాల ద్వారా నీటిని సమీకరించి.. నగరంలో సమృద్ధిగా నీరు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అపార్టుమెంట్లలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని నగర పాలక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.