కర్ఫ్యూపై వెనక్కి తగ్గిన కర్ణాటక.. ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యడ్డీ సర్కార్
కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ అన్నీ వర్గాల నుంచి వస్తోన్న ఒత్తిడి మేరకు ప్రభుత్వం తలొగ్గింది. కర్ప్యూ విధించబోమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్దగా ఆంక్షలు ఉండబోవు.
క్రిస్మస్ సందర్భంగా..
శుక్రవారం క్రిస్మస్ పర్వదినం.. ఈ సందర్భంగా కర్ఫ్యూ విధిస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రభుత్వం భావించింది. కరోనా స్ట్రెయిన్ గురించి వ్యాప్తి గురించి పక్కా సమాచారం కూడా లేదు. ఈ క్రమంలో కర్ఫ్యూ విధించొద్దు అని నిర్ణయం తీసుకుంది. ఇటు న్యూ ఇయర్ వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కర్ఫ్యూతో.. రాత్రి 10 గంటల తర్వాత బోసిపోతుందని అనుకున్నారు.. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
జాగ్రత్తలు తీసుకుంటే సరి..
ఈ నెల 24వ తేదీ (గురువారం) నుంచి జనవరి 2వ తేదీ వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఇదివరకు ఉత్తర్వుల్లో కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కానీ ప్రజల అభిప్రాయం తీసుకున్నాక.. కర్ఫ్యూ విధించడంపై ఎక్కువ మంది వ్యతిరేకత వ్యక్తం చేశారని ప్రభుత్వం తెలిపింది. కర్ఫ్యూ వల్ల కాక.. సొంతంగా నిబంధనలతో ఉంటే చాలు అని మెజార్టీ ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమయ్యింది. మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించి, పర్యటనలు చేయకుంటే సరిపోతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.
వైకుంఠ ఏకాదశి కూడా..
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై కర్ఫ్యూ ప్రభావం చూపనుంది. శుక్రవారం క్రిస్మస్తోపాటు వైకుంఠ ఏకాదశి కూడా ఉంది. ఈ రోజున భక్తులు ఉదయాన్నే వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి వరకు పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ క్రమంలో భక్తుల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావించింది. దాంతో కర్ఫ్యూపై వెనక్కి తగ్గింది.