స్పీకర్ కు షాక్ ఇచ్చిన కర్ణాటక గవర్నర్: ఈ రోజే సీఎం అవిశ్వాస తీర్మాణం, కాంగ్రెస్ చిందులు !
బెంగళూరు: కర్ణాటక శాసన సభ సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అంటూ ప్రత్యేక అధికారి ద్వారా ఆ రాష్ట్ర గవర్నర్ వాజూబాయ్ వాలా సమాచారం సేకరించారు. కర్ణాటక స్పీకర్ కేఆర్. రమేష్ కుమార్ కు ఈ రోజే సీఎం కుమారస్వామి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి అవకాశం ఇవ్వాలని గవర్నర్ వాజాబాయ్ వాలా స్పష్టమైన సందేశం పంపించారు. శాసన సభ సమావేశాల్లో గవర్నర్ ఎలా జోక్యం చేసుకుంటారు అంటూ కాంగ్రెస్ మండిపడింది.
గురువారం శాసన సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో గవర్నర్ పంపించిన సందేశాన్ని స్పీకర్ రమేష్ కుమార్ స్వయంగా చదివి శాసన సభ్యులకు వినిపించారు. ఈ రోజు (గురువారం) గడువులోపు ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్డడానికి అవకాశం కల్పించాలని గవర్నర్ సందేశం పంపించారని స్పీకర్ రమేష్ కుమార్ శాసన సభలో చెప్పారు.
శాసన సభా సమావేశాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడానికి వీలు లేదని, గవర్నర్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు కృష్ణభైరేగౌడ, హెచ్,కే. పాటిల్ ఆరోపించారు. శాసన సభా సమావేశాల్లో గవర్నర్ ఎలా జోక్యం చేసుకుంటారని వారు ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేలు కేఎస్. ఈశ్వరప్ప, జగదీష్ శెట్టర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము భోజనం విరామ సమయంలో గవర్నర్ ను కలిశామని, అందులో తప్పేముందని బీజేపీ నాయకులు అన్నారు. ఆ సమయంలో స్పీకర్ రమేష్ కుమార్ జోక్యం చేసుకున్నారు.
బీజేపీ నాయకులు గవర్నర్ ను కలిశామని అంగీకరించారని, వారు గవర్నర్ ను కలవడంలో ఎలాంటి తప్పు లేదని, ఆ హక్కు వారికి ఉందని స్పీకర్ రమేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గవర్నర్ ను అడ్డంపెట్టుకుని అడ్డదారిలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, మా ఎమ్మెల్యేలను రాత్రికిరాత్రి బెంగళూరు దాటిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
ఎమ్మెల్యేలను బెంగళూరు దాటించలేదని, వారి ఎమ్మెల్యేలను వారు కాపాడుకోకుండా మా మీద బురదచల్లుతున్నారని బీజేపీ ఆరోపించింది. కావాలనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభా సమావేశాలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ ఆరోపించారు. గురువారం సాయంత్రం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అసెంబ్లీలో వాదనలకు దిగారు.