వినాయక చవితి నుంచి విజయదశమి దాకా పండగలన్నింటినీ బ్యాన్ చేసిన బీజేపీ సర్కార్
బెంగళూరు: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఈ ఏడాది కూడా పూర్తిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తోన్నాయి. ఇప్పటికే కేరళలో వేల సంఖ్యలో రోజువారీ కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతోన్నాయి. తమిళనాడు, మహారాష్ట్రల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ థర్డ్వేవ్ ముంచుకుని రానుందనే సంకేతాలను పంపిస్తోన్నాయి..ఈ మూడు రాష్ట్రాలు కూడా. అక్కడ రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా కేసుల తీవ్రత తమ మీద పడకుండా ఉండటానికి కర్ణాటక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. సరిహద్దులను మూసివేసింది.
కాందహార్ కూడా తాలిబన్ల వశం: ఏంబసీని ఖాళీ చేయిస్తోన్న అమెరికా, బ్రిటన్
కరోనా నేపథ్యంలో కఠిన నిర్ణయాలు..
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విజృంభించిన సమయంలో దాని బారిన పడి తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల్లో ఒకటి కర్ణాటక. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇక థర్డ్వేవ్ కూడా ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ నిపుణులు చేస్తోన్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.. కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకుంది. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. మూడు నెలల పాటు ఎలాంటి పండగలను కూడా నిర్వహించకూడదంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తుషార్ గిరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
వినాయక చవితి మొదలుకుని విజయదశమి దాకా..
వినాయక చవితి మొదలుకుని విజయదశమి ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడటానికి అవకాశం ఉండే ఏ ఒక్క పండగను కూడా నిర్వహించకూడదని కర్ణాటకలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆదేశించింది.. ఉత్తర్వులను కూడా జారీ చేసింది. మొహర్రంను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఈ నెల 20వ తేదీన మొహర్రం పండుగను బహిరంగంగా జరుపుకోకూడదంటూ ఉత్తర్వుల్లో పొందుపరిచింది. తక్షణమే అమలులోకి వచ్చిన ఈ ఉత్తర్వులు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయి. అక్టోబర్ చివరివారం వరకూ ఈ ఆదేశాలను వర్తింపజేసింది ప్రభుత్వం.
మండపాలకు నో ఛాన్స్
వినాయక చవితి పండుగ ఎలా జరుపుకొంటాామో మనకు తెలిసిన విషయమే. వీధివీధినా గణేషుడి మండపాలను ఏర్పాటు చేస్తుంటారు భక్తులు. తొమ్మిదిరోజుల పాటు విఘ్నేశ్వరుడికి పూజలను నిర్వహిస్తుంటారు. అనంతరం ఊరేగింపుగా విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. సామూహికంగా జరుపుకొనే పండగ కావడం వల్లే వినాయక చవితిపై నిషేధం విధించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎవరి ఇళ్లల్లో వారు సంప్రదాయబద్ధంగా బొజ్జ గణపతికి పూజలు నిర్వహించుకోవచ్చని, బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో వినాయకుడి మండపాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతులను ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.
మొహర్రం ఊరేగింపులూ రద్దు..
మొహర్రం పండగ కూడా ఇలాంటిదే. మొహర్రం సందర్భంగా ముస్లింలు ఆలం, పంజా, పీర్ల ఊరేగింపులను నిర్వహిస్తుంటారు. వేలాదిమంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం దీన్ని కూడా నిషేధించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ప్రొటోకాల్స్కు అనుగుణంగా మాస్కులు, భౌతిక దూరాన్ని పాటిస్తూ మసీదుల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించింది. కమ్యూనిటీహాళ్లు, మైదానాలు, షాదీ మహల్ లలో ప్రార్థనలను నిషేధించామని సర్కారు పేర్కొంది.
థర్డ్ వేవ్ ముప్పు..
పది సంవత్సరాల లోపు పిల్లలు, 60 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులంతా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సూచించారు. మసీదులకు కూడా వెళ్లొద్దని స్పష్టం చేసింది. అక్టోబర్లో వైభవంగా నిర్వహించే విజయదశమి ఉత్సవాలను కూడా ప్రభుత్వం ఈ జాబితాలో చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దసరా పండగకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన మైసూరులో బహిరంగ వేడుకలను నిర్వహించకూడదని కర్ణాటక ప్రభుత్వం వివరించింది. భక్తులు లేకుండా సంప్రదాయబద్ధమైన అంబారీ వేడుకలను నిర్వహించుకోవచ్చని తెలిపింది. కరోనా వైరస్ థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నందు వల్లే ఈ కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.