ఆపరేషన్ కమల భయం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల రిసార్టు రాజకీయాలు, ప్రభుత్వం!
బెంగళూరు: కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. బీజేపీ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను రిసార్ట్ లో దాచిపెట్టి ఆ పార్టీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
బీజేపీ నాయకులను ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు బెంగళూరు శివార్లలోని ఈగల్ రిసార్ట్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలను తరలించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించమని, నీచ రాజకీయాలు చెయ్యమని పదేపదే చెప్పారు.
అయితే ఆపరేషన్ కమల భయంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించారు. బీజేపీ నాయకులు చేస్తున్న నీచ రాజకీయాలు తాము చెయ్యలేమని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదేపదే బీజేపీ మీద సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు.
బీజేపీ మీద విరుచుకుపడిన సిద్దరామయ్య నేడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించి సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా ? ఆపరేషన్ కమలతో బీజేపీ అధికారంలోకి వస్తుందా ? రాష్ట్రపతి పాలన పెడుతారా ? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. కర్ణాటకలో ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నాలు చెయ్యడం లేదు కాని, అధికారంలో ఉండాలని నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.