విశ్వప్రయత్నాలు, అత్యవసర సమావేశం: ఉంటుందా, ఉడుతుందా, బీజేపీ వెయిటింగ్, ఢిల్లీలో !
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం రెండు పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ తదితరులు బుధవారం అర్దరాత్రి దాటే వరకు బెంగళూరులోని తాజ్ హోటల్ లో సమావేశం అయ్యారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం పతనం కోసం బీజేపీ వెయింటింగ్ లో ఉంది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించే ఒక్కరోజు ముందే కేసీ. వేణుగోపాల్ బెంగళూరు చేరుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు జరిపి ఎప్పటికప్పుడు ఢిల్లీలోని హై కమాండ్ కు సమాచారం ఇస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు గురించి కేసీ. వేణుగోపాల్ ఆరా తీశారాని సమాచారం.
సర్వేల దెబ్బ
కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి లోక్ సభ ఎన్నికల ఫలితాల దెబ్బ పడిందని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అసమ్మతి కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో సంకీర్ణ ప్రభుత్వం తీరు గోడ మీద దీపం అయ్యింది. జేడీఎస్ నాయకులు సైతం మేము ఏమీ తక్కవ కాదు అంటూ ప్రభుత్వ మీద పెత్తనం చెలయించడానికి సిద్దం అవుతున్నారు.
ఆపరేషన్ కమల
బీజేపీ ఇప్పటికే ఆపరేషన్ కమల మొదలు పెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కమలలో భాగంగానే మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి ఢిల్లీలో మకాం వేశారని సమాచారం. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరండి అంటూ బహిరంగంగా పిలుపునిచ్చారు.
ఉప ఎన్నికలు
చించోళి, కుందగోళ్ శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు సైతం సంకీర్ణ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది. రెండు శాసన సభ ఉప ఎన్నికల ఫలితాలు తారుమారు అయితే రెండు పార్టీల నాయకులకు కోలుకోలేని దెబ్బపడుతుంది. ఇప్పటికే ఆపరేషన్ కమల మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నాయకులకు ఎత్తింది చెయ్య అవుతోంది.
చాన్ప్ ఇస్తే కష్టం
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అయితే ఏం జరిగినా పర్వాలేదు అంటన్నారు జేడీఎస్ నాయకులు.
బీజేపీ లీడర్స్
ఏ ఒక్క చాన్స్ చిక్కినా చాకచక్యంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు వేచిచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేలు ఒకవైపు, లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకులు వేచి చూస్తున్నారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోకుండా చూసుకోవాలని కాంగ్రెస్ హై కమాండ్ చూస్తోంది. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు గంటకు ఒక మలుపు తిరిగే అవకాశం ఉంది.